logo

సాయం పేరుతో సహజీవనం

భూ వివాదంలో సాయం చేస్తానని నమ్మబలికి.. వివాహితతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం ఆమె ప్రాణాలు తీయడంతోపాటు మృతదేహాన్ని దహనం చేసిన ఉదంతమిది

Published : 02 Feb 2023 04:24 IST

ప్రత్యర్థితో చేతులు కలిపి ప్రియురాలిని అంతమొందించాడు
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

నిందితులను చూపుతున్న పోలీసులు

చింతలపూడి, న్యూస్‌టుడే: భూ వివాదంలో సాయం చేస్తానని నమ్మబలికి.. వివాహితతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం ఆమె ప్రాణాలు తీయడంతోపాటు మృతదేహాన్ని దహనం చేసిన ఉదంతమిది. చింతలపూడిలో ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చింతలపూడి నగర పంచాయతీలోని ఎస్బీఐ నగర్‌కు చెందిన ఓ మహిళ(37) భర్త 2015లో చనిపోయారు. అప్పటి నుంచి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ఆమె స్థానికంగా ఉన్న అత్తారింట్లో ఉంటున్నారు. సత్తుపల్లి మండలం గంగారంలో ఉన్న సుమారు అరెకరం భూమి విషయంలో వైరాకు చెందిన నంబూరి శ్రీనివాసరావుతో మహిళకు కొంతకాలం నుంచి వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై ఆమె 2016లో కోర్ట్టులో దావా వేశారు. మూడేళ్ల క్రితం చింతలపూడి మండలం ఎండపల్లికి చెందిన బర్రె రాంబాబుతో పరిచయం ఏర్పడింది. భూమి విషయంలో సహాయ, సహకారాలు అందిస్తానని చెప్పడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. భూవివాదం ఎంతకీ తేలకపోవడంతో నంబూరి శ్రీనివాసరావు, బర్రె రాంబాబు ఒక్కటయ్యారు. మహిళను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా జనవరి 19న మహిళను రాంబాబు అద్దె కారులో ఎక్కించుకొని కాకినాడ సర్పవరం జంక్షన్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయారు. జనవరి 21న తెల్లవారుజామున మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని దమ్మపేట మండలం ఆర్లపెంట శివారులోని డంపింగ్‌ యార్డు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. ఆ సమయంలో ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అదే రోజు మహిళ సోదరుడితో కలిసి చింతలపూడి ఠాణాకు వెళ్లి ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానిస్తున్నారనే భయంతో హైదరాబాద్‌ పారిపోయాడు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై హరికృష్ణ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఎస్సై తన సిబ్బందితో కలిసి హైదరాబాద్‌ వెళ్లి గాలించి నిందితుడిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన బర్రె రాంబాబు, నంబూరి శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని