logo

దారి కాచిన ప్రమాదాలు

అధ్వాన దారులు ప్రమాదాలకే కాదు.. చోరీలకు కారణమవుతున్నాయి. ఈ ఘటన మహానంది పుణ్యక్షేత్రం వద్ద సోమవారం రాత్రి జరిగింది.

Published : 30 Nov 2022 04:36 IST

గుంతలమయంగా మహానందికి వెళ్లే రహదారి

మహానంది, న్యూస్‌టుడే: అధ్వాన దారులు ప్రమాదాలకే కాదు.. చోరీలకు కారణమవుతున్నాయి. ఈ ఘటన మహానంది పుణ్యక్షేత్రం వద్ద సోమవారం రాత్రి జరిగింది. రహదారి గుంతల మయంగా మారడంతో బస్సు నిదానంగా వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలోకి ఎక్కి అయ్యప్ప మాలధారుల ఇరుముడులు తస్కరించారు. అందులో నగదు ఉంటుందన్న ఆలోచనతో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.

3 కి.మీ ముప్పుతిప్పలు

మహానంది ఫారం- మహానంది గ్రామాల మధ్యనున్న మూడు కి.మీల దారిలో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దారి మొత్తం గుంతల మయంగా మారడం. ఇరువైపులా ముళ్లపొదలు దట్టంగా పెరగడంతో చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి అధ్వానంగా మారడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్న క్రమంలో రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలను బలవంతంగా ఆపి దోపిడీలకు పాల్పడుతున్నారు. 2017లో బోయిలకుంట్లమెట్ట నుంచి గాజులపల్లె ఆర్‌.ఎస్‌.గ్రామాల మధ్యలో దారి గుంతలమయంగా ఉండేది. అప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం అక్కడ దారి బాగుపడింది.

ఐదేళ్ల కిందట రూ.2 కోట్లు

* మహానంది ఫారం - మహానంది మార్గంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల, శ్రీవేంకటేశ్వర పశు పరిశోధన స్థానం, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానం, గుంటూరు- గుంతకల్లు రైలుమార్గాలు కలిపే గాజులపల్లె రైల్వేస్టేషన్‌, నంద్యాల- అమరావతి రాజధానిని కలిపే ప్రధాన రహదారిలోని బోయిలకుంట్లమెట్ట వరకు దారి 8 కి.మీ.ల దూరం ఉంది.
* రహదారిని బాగు చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఐదేళ్లుగా చెప్తున్నా పనులకు అడుగులు పడటం లేదు. మూడు కి.మీల దారితోపాటు పాలేరువాగుపై వంతెనను నిర్మించేందుకు రూ.2 కోట్లు మంజూరై ఐదేళ్లయింది.


అయ్యప్ప మాలధారుల ఇరుముడులు చోరీ

మాలధారులు ప్రయాణించిన బస్సు

విజయనగరం జిల్లా పెడమానాపురానికి చెందిన బి.సత్యంనాయుడుతోపాటు 40 మంది అయ్యప్ప మాలధారుల బృందం బస్సులో సోమవారం రాత్రి శ్రీశైలం నుంచి మహానందికి చేరుకుంది. 40 ఇరుముడులను మూడు భాగాలుగా కట్టి బస్సు వెనుక భాగంలో ఉంచారు. మహానందికి దక్షిణ దిశలోని టోల్‌గేటు వద్ద ప్రవేశ రుసుమును చెల్లించడానికి దిగిన క్రమంలో వెనుక పెట్టెకు తాళం లేకపోవడంతో తెరిచి చూశారు. అందులో ఇరుముడులు లేకపోవడంతో నిర్ఘాంతపోయారు. మహానందిఫారం సమీపంలోని పాలేరువాగు గడ్డను దాటుతున్న క్రమంలో వాటిని దొంగలు చోరీ చేసినట్లు గుర్తించారు. దారి గోతులతో ఉండటంవల్ల బస్సు నిదానంగా వస్తున్న సమయంలో తస్కరించి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం నంద్యాల గ్రామీణ సీఐ రవీంద్ర, సిబ్బంది విచారణ చేపట్టారు. భక్తులు తమ యాత్రను కొనసాగిస్తూ కాణిపాకం పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని