logo

ఎమ్మెల్యేగా మాటిచ్చారు.. మంత్రిగా మాయ చేశారు

బెంగళూరుకు చెందిన ‘ఇట్టినా ప్లాంటేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ 2006లో కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని చిన్నహోతూరు, పెద్దహోతూరు, ఆస్పరి పరిసర ప్రాంతాల్లో 454.37 ఎకరాల భూమి కొనుగోలు చేసింది.

Updated : 03 Dec 2022 12:38 IST

180 ఎకరాల ఇట్టినా భూములు సొంతం
గుమ్మనూరు తీరుపై రైతులు మండిపాటు

పొలంలో పప్పు  శనగ సాగు చేసిన రైతులు

కంపెనీ ఏం చెప్పింది

‘‘ భూములిస్తే.. పరిశ్రమ ఏర్పాటు చేస్తాం.. చదువుకున్న పిల్లలకు ఉద్యోగం కల్పిస్తామన్న ఇట్టినా ప్లాంటేషన్‌ ప్రతినిధుల మాటలు నమ్మి ఉన్న భూములు కట్టబెట్టారు. ఐదేళ్లు గడిచినా పరిశ్రమకు పునాది పడలేదు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే పరిశ్రమ ఏర్పాటు చేసే వరకు మీ భూములను మీరే సాగు చేసుకోండని సర్దిచెప్పారు.

మంత్రి ఏం చెప్పారు

* 2019 ఎన్నికల సమయంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి జయరాంకు రైతులు సమస్యను విన్నవించారు. రాబోయేది వైకాపా ప్రభుత్వమే తప్పకుండా భూములు ఇప్పించేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2020లో ఆ భూములు మంత్రి జయరాం తన కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేయడం గమనార్హం.

* ఎలాంటి ఆదాయ వనరు లేకపోయినా 30 ఎకరాల భూమిని రూ.52.42 లక్షలతో కొనుగోలు చేయడానికి డబ్బు ఎలా వచ్చిందో 90 రోజుల్లో సమాధానమివ్వాలని మంత్రి సతీమణి పెంచలపాడు రేణుకమ్మతోపాటు ఆలూరు సబ్‌రిజిస్ట్రార్‌కూ అక్టోబరు 31న ఆదాయ పన్ను శాఖ తాఖీదులిచ్చింది. ఈ అంశం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భూములు తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండు చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణం, ఆస్పరి

* బెంగళూరుకు చెందిన ‘ఇట్టినా ప్లాంటేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ 2006లో కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని చిన్నహోతూరు, పెద్దహోతూరు, ఆస్పరి పరిసర ప్రాంతాల్లో 454.37 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. భూమి ఇచ్చిన ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్న ఒప్పందంతో ఎకరం రూ.22 వేలకు కొనుగోలు చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు.

* తర్వాత కంపెనీ ఏర్పాటు కాకపోవడం.. వాటిపై మంత్రి గుమ్మనూరు జయరాం కన్ను పడింది. ఆస్పరి మండలంలో 674/ఇ, 729, 666/2, 668/సి, 669/సి, 713/ఏ సర్వే నంబర్లలోని 30.83 ఎకరాల భూమి 2020 మార్చి 2న రేణుకమ్మ పేరుతో రిజిస్ట్రేషన్‌ అయ్యింది. అదే రోజు ఇతర కుటుంబ సభ్యులు, బంధువుల పేరుతోనూ 180 ఎకరాల వరకు కొనుగోలు చేశారు. మంత్రి కుటుంబ సభ్యుల చేతిలోకి భూములు వెళ్లడంతో పంటలు సాగు చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లారు. వేసుకున్న పంటలూ దున్నేశారు. వారంతా ఎదురుతిరగడంతో వెనక్కి మళ్లారు.


రైతులకు తిరిగి ఇవ్వాలి
- గిడ్డయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి

పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను మంత్రి జయరాం తన కుటుంబ సభ్యుల పేరిట మార్చుకోవడం సరికాదు. 2019 ఎన్నికల హామీలో భాగంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే భూములు రైతులకు అప్పగిస్తామని చెప్పి, వారే కొనటం సరైంది కాదు. వాటిని తిరిగి ఆ రైతులకు అప్పగించాలి.


అన్నదాతలకు అండగా ఉంటాం
- హనుమంతు, సీపీఎం

రైతుల భూములను మంత్రి తిరిగి ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. రైతులకు అండగా ఉంటాం. పరిశ్రమలో ఉపాధి లభిస్తుందనే ఆశతో తక్కువ ధరకు అమ్మిన వాటిని మంత్రి కొనుగోలు చేయడం సరికాదు. రైతులను నిలువునా మోసం చేసినట్లవుతుంది. ఇది వారు గుర్తించి న్యాయం చేయాలి.


వలస వెళ్లి బతుకుతున్నాం
- మహానంది

ఉన్నచోటనే ఉపాధి ఉంటే.. మా పిల్లలు బాగుపడతారని నాన్న పొలం అమ్మేశారు. ఆ భూముల్లో పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. ఉపాధి పోయింది. దీంతో వలస వెళ్లి బతుకుదెరువు సాగిస్తున్నాం. ప్రస్తుతం మాకు రెండు ఎకరాలు ఉంది. మేము ఇద్దరం అన్నదమ్ములం. ఉన్నదాన్ని అమ్ముకుని ఊరూరా తిరిగి జీవనం సాగిస్తున్నాం. మా భూములను మాకు ఇప్పించాలని వేడుకుంటున్నాం.


ట్రాక్టర్లతో దున్నేశారు  - రామకృష్ణ

కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు.. ఇప్పటి వరకు ఒక్క ఇటుక పేర్చలేదు. అమ్మిన నాటి నుంచి మా భూముల్లో మేమే సాగు చేసుకుంటున్నాం. 2020లో మంత్రి జయరాం కొనుగోలు చేసిన తర్వాత మేము సాగు చేసిన పొలాలను ట్రాక్టర్లతో దున్నేశారు. దీంతో అందరం కలిసి అడ్డుకున్నాం. ప్రస్తుతం ఆ భూములు మేమే సాగు చేస్తున్నాం. ప్రస్తుతం మా భూముల మార్కెట్‌ ధర రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షలు ఉంది. గతంలో కొనుగోలు చేసిన దానికంటే కొంత ఎక్కువ ధరకు అమ్మితే మేమే తీసుకుంటాం. మా భూముల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.


ఉన్నదంతా అమ్మేశాం  - మహానంది

మా నాన్న రంగన్న 2006లో ఇట్టినా కంపెనీ వారికి 12 ఎకరాల పొలాన్ని ఎకరం రూ.22 వేల చొప్పున విక్రయించారు. ఆ భూముల్లో కంపెనీ ఏర్పాటు చేసి.. అందులో ఉద్యోగం ఇస్తామని చెప్పినందుకే మా నాన్న అమ్మేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. మాకు సెంటు భూమి లేదు. దీంతో వలస వెళ్లి జీవనం సాగిస్తున్నాం.


మాకు న్యాయం చేయాలి  - రాజు

మా నాన్న తిమ్మన్న ఐదెకరాల పొలాన్ని అమ్మేశారు. కంపెనీ ఏర్పాటు చేసే వరకు రైతులే సాగు చేసుకోవచ్చని ప్రతినిధులు తెలిపారు. ఎమ్మెల్యే జయరాం దృష్టికి తీసుకెళ్తే న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడేమో వారి కుటుంబ సభ్యులే కొనుగోలు చేసి రైతులకు అన్యాయం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రైతు సంఘాల నాయకులను కలిసి పోరాటం చేస్తూనే ఉన్నాం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాకు న్యాయం చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని