logo

జగన్‌ మామయ్యా.. ఇదేం పరీక్ష

‘‘ పరీక్ష అంటే.. ఉపాధ్యాయులు ప్రశ్నపత్రం ఇస్తారు.. తెల్ల కాగితంపై విద్యార్థులు సమాధానాలు రాస్తారు. కానీ శుక్రవారం నుంచి ప్రారంభమైన ఫార్మేటివ్‌-2 పరీక్షలో ప్రశ్నపత్రం ఇవ్వలేదు.. బోర్డుపై ఉపాధ్యాయులు ప్రశ్నలు రాశారు.. వాటిని విద్యార్థులు నోట్‌ చేసుకుని జవాబులు రాయాల్సి వచ్చింది.

Published : 03 Dec 2022 01:35 IST

చుక్కలు చూపిన ఫార్మేటివ్‌-2

చరవాణిలో చూస్తూ బోర్డుపై ప్రశ్నలు రాస్తున్న ఉపాధ్యాయుడు

నంద్యాల పట్టణం, రుద్రవరం న్యూస్‌టుడే: ‘‘ పరీక్ష అంటే.. ఉపాధ్యాయులు ప్రశ్నపత్రం ఇస్తారు.. తెల్ల కాగితంపై విద్యార్థులు సమాధానాలు రాస్తారు. కానీ శుక్రవారం నుంచి ప్రారంభమైన ఫార్మేటివ్‌-2 పరీక్షలో ప్రశ్నపత్రం ఇవ్వలేదు.. బోర్డుపై ఉపాధ్యాయులు ప్రశ్నలు రాశారు.. వాటిని విద్యార్థులు నోట్‌ చేసుకుని జవాబులు రాయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం చుక్కలు చూపించింది.

ఉదయం ఒకటి.. మధ్యాహ్నం మరొకటి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 4,46,876 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 1,92,312 మంది ఫార్మేటివ్‌-2 పరీక్షలకు హాజరయ్యారు. రోజుకు రెండు పరీక్షల చొప్పున 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఉదయం, మధ్నాహ్నం రెండు పరీక్షలు నిర్వహించారు. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నమే రెండు పరీక్షలు పెట్టారు. 9, 10 తరగతులకు ఉదయం, మధ్నాహ్నం పరీక్షలు జరిగాయి. 

వాట్సాప్‌లో ప్రశ్నపత్రం

* గతంలో ఫార్మేటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షలు నిర్వహించేవారు. ప్రశ్నపత్రాలను రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ విడుదల చేసేది. వాటికి సంబంధించిన సమాధానాలు తెల్ల పేపరు లేదా ప్రత్యేక నోటు పుస్తకంలో రాయించేవారు.

* సమ్మెటివ్‌ పరీక్షకు మాత్రమే ఏకరూప ప్రశ్నపత్రం విధానం ఉండేది. ప్రశ్నపత్రాలను విద్యా శాఖనే పంపిణీ చేసేది.

* ప్రస్తుతం ఫార్మేటివ్‌ పరీక్షలకూ ఒకే ప్రశ్నపత్రం ఉండాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. పరీక్ష ముందు రోజు అర్ధరాత్రి 1 గంటకు ప్రధానోపాధ్యాయుడి వాట్సాప్‌నకు ప్రశ్నపత్రం వస్తోంది.. ఉదయాన్నే ఆయా ఉపాధ్యాయులకు వాట్సాప్‌నకు పంపితే వారు తరగతి గదుల్లోని బ్లాకు బోర్డుపై చరవాణుల్లో చూసుకుంటూ ప్రశ్నలు రాశారు.

ఉపాధ్యాయుల అవస్థలు

* ఒకే ఉపాధ్యాయుడు రెండు, మూడు తరగతులకు సంబంధించి ప్రశ్నపత్రాలు బోర్డుపై రాయడం.. విద్యార్థులు తెల్ల కాగితాలంపై సమాధానాలు రాసుకునేలా పర్యవేక్షించడం కష్టంగా మారింది. కనీసం ఒకరోజు చెప్పి... పాఠశాల గ్రాంట్‌ ద్వారా జిరాక్సు చేయించుకునేలా విద్యాశాఖ సూచించి ఉంటే బాగుండదనే పలువురు అభిప్రాయపడుతున్నారు. సీబీఏ పరీక్షలకు ఓఎంఆర్‌ జవాబు పత్రాల విధానం తీసుకొచ్చి రూ.లక్షలు ఖర్చు చేశారు.. ఫార్మేటివ్‌ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది.

* ఒకటి, రెండు తరగతులకు సంబంధించి శుక్రవారం ఇచ్చిన ప్రశ్నపత్రంలో బొమ్మలు ఉన్నాయి. వాటిని బోర్డుపైన ఉపాధ్యాయులు గీయడం.. విద్యార్థులు సమాధానం రాయడం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తెలుగులో పేరాగ్రాఫ్‌ తరహా ప్రశ్నలు ఉండటంతో బోర్డు మీద రాయడానికే ఉపాధ్యాయులకు సమయం పట్టింది. విద్యార్థులు సమాధానాలు రాయడానికి సమయం తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని