logo

అందని కట్టలు.. కుంగిన కట్ట

రాయలసీమ రైతుల జీవనాడి గోరుకల్లు జలాశయం కట్ట కుంగిపోయింది.. రెండు చోట్ల కుంగిపోయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Published : 04 Jun 2023 04:47 IST

 ప్రమాదకరంగా గోరుకల్లు జలాశయం

 రెండేళ్లుగా కానరాని నిర్వహణ నిధులు

పాణ్యం, పాణ్యంగ్రామీణం, న్యూస్‌టుడే : రాయలసీమ రైతుల జీవనాడి గోరుకల్లు జలాశయం కట్ట కుంగిపోయింది.. రెండు చోట్ల కుంగిపోయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు బీళ్లుగా మారనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజలాలను ఎస్సార్బీసీ, గాలేరు నగరి కాల్వల ద్వారా ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలకు తరలించాలన్న లక్ష్యంతో గోరుకల్లు జలాశయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 12.44 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2006లో పనులు ప్రారంభించారు. ఇందుకు రూ.430 కోట్లు వెచ్చించారు. మంచినీటితోపాటు, 1.90 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. 2016లో నీటి నిల్వ ప్రారంభించినా ఇప్పటికీ జలాశయం పనులు 92 శాతమే పూర్తి చేశారు.

11 టీఎంసీలే నిల్వ

పనులు పూర్తికాకపోవడంతో గోరుకల్లు జలాశయంలో ప్రస్తుతం 11 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నీటి నిల్వ చేయడం ప్రారంభించిన వెంటనే ఊట నీరు భారీగా బయటకు వస్తోంది. గోరుకల్లు గ్రామంలోని ఇళ్లల్లోకి ఊట రావడంతో గ్రామస్థులంతా ఆందోళన చేపట్టారు. నివారణ కోసం రూ.45 కోట్లతో లోడ్‌బండింగ్‌ పనులు చేపట్టారు. క్రమంగా నీటి నిల్వ శాతాన్ని పెంచుతూ వచ్చారు. ఇంతలోనే రెండు చోట్ల మట్టికట్ట కుంగివిషయం వెలుగులోకి వచ్చింది. 

మరో అలగనూరు కానుందా

అలగనూరు జలాశయం మట్టి కట్ట కుంగిపోవడంతో నీటి నిల్వను నిలిపివేశారు. రూ. 3.2 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టారు. బిల్లులు రాలేదని గుత్తేదారు పనులు నిలిపివేశారు. జాప్యం కావడంతో మట్టికట్ట మరింత కుంగడంతో రూ.24 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో రెండేళ్లుగా జలాశయంలో నీటిని నిల్వ చేయడం లేదు. గోరుకల్లు జలాశయంలో విషయంలో ఇలానే నిర్లక్ష్యం చేస్తే మరో అలగనూరుగా మారుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘‘ కుంగిపోయిన మట్టికట్టను పరిశీలించాం.. మరమ్మతులు చేసే అంశంపై రెండ్రోజుల్లో ప్రతిపాదనలు పంపిస్తాం. త్వరగా పనులు పూర్తి చేసి సాగునీటికి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని’’ జలవనరులశాఖ సీఈ కబీర్‌ తెలిపారు.

బిల్లులు రాక.. ఆగిన మరమ్మతులు

జలాశయం నిర్వహణకు ప్రభుత్వం మూడేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదు. జలాశయం కట్టపై ముళ్లపొదలు దట్టంగా పెరిగాయి. వర్షాలకు మట్టికట్ట కోతకు గురవుతోంది. గుంతలు పడి బలహీనంగా మారింది. గ్రామస్థులు ఆందోళన చేయడంతో అధికారులు రూ.40 లక్షల అంచనాతో మరమ్మతులు ప్రారంభించారు. బిల్లులు రాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని