logo

యోగక్షేమం ఆరోగ్యం పదిలం

వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ఆదోనిలో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో యోగాపై వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.

Published : 07 Jun 2023 02:17 IST

జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో శిక్షణ

యోగా సాధన చేయిస్తున్న గురువు కేశవ్‌

వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ఆదోనిలో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో యోగాపై వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఆదోని పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానంతో పాటు స్థానిక ఎంఐజీ కాలనీలో రెండు చోట్ల యోగాపై ఉచిత శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. యోగా గురువు మాస్టర్‌ కేశవ్‌ పర్యవేక్షణలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.  
న్యూస్‌టుడే, ఆదోని సాంస్కృతికం


జాతీయ స్థాయి పోటీలే లక్ష్యం

ఆదోని పట్టణానికి చెందిన మల్లప్ప, శ్రీదేవి దంపతుల కుమార్తె హరిప్రియ ఐదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుతూనే మరోవైపు యోగా వేసవి శిక్షణ శిబిరంలో సాధన చేస్తోంది. ఏటా జరిగే శిక్షణ శిబిరంలో మెలకువలు నేర్చుకుంటోంది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. గుంటూరు, ఆళ్లగడ్డలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొని మూడోస్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకు అనుగుణంగానే గురువు చెప్పే మెలకువలు నేర్చుకుంటూ సాధన చేస్తున్నానని చెబుతోంది హరిప్రియ.

రెండు శిబిరాలు

యోగాలో సాధన చేయడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యం, ఒత్తిడి తగ్గడం, క్రమశిక్షణ, లక్ష్యంపై గురి పెరగడం వంటి ఉపయోగాలు ఉంటాయని యోగా గురువులు పేర్కొంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను క్రమం తప్పకుండా శిక్షణ శిబిరాలకు పంపిస్తు యోగాపై సాధన చేయిస్తున్నారు. సూర్య హాసన్‌, చక్ర హాసన్‌ తదితర ఆసనాలు సాధన చేస్తున్నారు. పట్టణంలోని రెండు శిబిరాల్లో దాదాపు 200 మంది విద్యార్థులు శిక్షణకు హాజరవుతున్నారు.

ఏకాగ్రతతో సాధన

ఆదోని పట్టణానికి చెందిన సైనికుడు దస్తగిరి, రజియాబాను దంపతుల కుమార్తె సనా జైనబ్‌ యోగాసనాలు వేస్తూ ప్రతిభ చూపుతోంది. వేసవి సెలవులు వృథా చేయకుండా ఉండాలని రోజూ ఆదోని పట్టణంలో నిర్వహిస్తున్న యోగా శిక్షణ శిబిరానికి హాజరవుతోంది. ఆసనాలు సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఉత్సాహం పెరుగుతోంది. అవలీలగా ఆసనాలు వేస్తోంది. రెండేళ్లుగా వేసవి శిక్షణ శిబిరానికి హాజరవుతూ మెలకువలు నేర్చుకుంటోంది. విద్యార్థులకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతోందని వివరిస్తోంది జైనబ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని