logo

ప్లాస్టిక్‌పై సమరం.. ఆరోగ్యానికి అభయం

ప్లాస్టిక్‌.. మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. అనారోగ్య సమస్యలకు హేతువుగా మారింది. క్యాన్సర్లకు మూల కారణమవుతోంది. ఈ తరుణంలో ఆ మహమ్మారిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన తరుణం ఆసన్నమైంది. మరోవైపు కేంద్ర,

Published : 30 Jun 2022 03:03 IST

రేపటి నుంచి పక్కాగా అమలుకు కేంద్రం చర్యలు
న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ

సంగారెడ్డిలో అవగాహన కల్పిస్తూ..

ప్లాస్టిక్‌.. మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. అనారోగ్య సమస్యలకు హేతువుగా మారింది. క్యాన్సర్లకు మూల కారణమవుతోంది. ఈ తరుణంలో ఆ మహమ్మారిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన తరుణం ఆసన్నమైంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం దిశగా పలు రకాల చర్యలు చేపట్టడం గమనార్హం. ఇప్పటికే వివిధ దశల్లో మార్పు తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించి అమలుచేశారు. ఇందులో భాగంగా జులై 1 నుంచి 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌పై నిషేధం దిశగా ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై దేశ వ్యాప్తంగా నిషేధం అమలులోకి రానుండటం శుభపరిణామం.
నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ ఒక భాగంగా మారింది. ఎంతలా అంటే.. దాని వినియోగం లేనిదే ఆ రోజు గడవడం కష్టమయ్యేంతగా..! ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కూరగాయలు, సరుకులు, ఇతర ఎలాంటి వస్తువులు తేవాలన్నా.. వెంటనే ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించడం పరిపాటిగా మారింది. ఇక పలుచోట్ల అల్పాహార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, చిరుతిళ్ల దుకాణాలు, బండ్లు, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో వినియోగం విచ్చలవిడిగా అవుతోంది. మున్సిపాలిటీలు, పంచాయతీ అధికారులు, పాలకవర్గాలు నామమాత్రంగా దృష్టి సారించడంతో యధావిధిగా వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాల్సి ఉంది.

వెనుకడుగు..

మూడేళ్లుగా ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధానికి వివిధ రకాల ప్రయత్నాలు చేసింది. మొదట్లో పక్కాగా అమలు చేయగా.. మళ్లీ యధా స్థితికి చేరింది. మూడేళ్ల కిందట అన్ని పురపాలికల్లో ప్రత్యేక దృష్టిసారించి కట్టుదిట్టం చేశారు. దాడులు నిర్వహించి జరిమానాలు విధించారు. ఈ క్రమంలో అవగాహన కల్పించగా.. ఎంతోమంది వ్యాపారులు సై అంటూ ముందుకొచ్చారు. సంగారెడ్డి, సిద్దిపేట పట్టణాల్లో మాంసం వ్యాపారులు టిఫిన్‌ డబ్బాలు పట్టుకురావాలని, కిరాణా దుకాణం వారు వస్త్ర సంచులు తీసుకురావాలని కోరుతూ ఫ్లెక్సీలు సైతం ఏర్పాటుచేశారు. కొందరు రాయితీలు సైతం ఇచ్చారు. ఇక పలు స్వచ్ఛంద సంస్థలు వస్త్ర సంచులను ఉచితంగా పంపిణీ చేశాయి. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి మొదటికే వచ్చింది.

చైతన్యం తీసుకొస్తేనే..

నాలుగు జిల్లాల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, చేర్యాల, హుస్నాబాద్‌, మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట, సంగారెడ్డి, సదాశివపేట, జిన్నారం, జహీరాబాద్‌, జోగిపేట, నారాయణఖేడ్‌, వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ పురపాలికలు ఉన్నాయి. నిషేధం క్షేత్రస్థాయిలో పక్కాగా అమలైతేనే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్‌లో సైతం ప్లాస్టిక్‌ నిషేధం అమలుతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరుపై మార్కులు కేటాయిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.


నిషేధిత జాబితాలో ఉన్నవి

ప్లాస్టిక్‌ చెవి పుల్లలు, ప్లాస్టిక్‌ జెండాలు, బెలూన్లకు వాడే ప్లాస్టిక్‌ పుల్లలు, క్యాండీ ఐస్‌ క్రీం స్టిక్స్‌, థర్మోకోల్‌, ప్లేట్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, ప్యాకింగ్‌ ఫిల్మ్‌, స్వీట్‌బాక్సులు, ఆహ్వాన పత్రికలు, సిగరెట్‌ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపు బరువున్న ప్లాస్టిక్‌, పీవీసీ బ్యానరు, ఇతరత్రావి. ఆయా వాటిని నిషేధం దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిషేధాన్ని బేఖాతరు చేస్తే.. అయిదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా, కొన్ని కేసుల్లో రెండూ విధిస్తారు.


ఆరేళ్ల నుంచి..

జిల్లా కేంద్రం సిద్దిపేటలో 43 వార్డుల్లో 1.57 లక్షల జనాభా నివసిస్తోంది. మున్సిపల్‌ పరిధిలో నిత్యం 800 కిలోల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతోంది. దాన్ని మరింతగా తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. 2016 నుంచే ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రి హరీశ్‌రావు మార్గనిర్దేశనంలో కఠినంగా అమలు చేసేందుకు ఏడుగురితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది జులై 1 నుంచి దిశగా నిఘా పెట్టారు. 75 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్లు (క్యారీ బ్యాగుల) విక్రయం, వినియోగం కట్టుదిట్టం చేశారు. అప్పటి నుంచి 300 మందికి పైగా జరిమానాలు విధించారు. పట్టణంలో పాత 34 వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేశారు.


కార్యాచరణ ఇలా..

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఇప్పటికే పురపాలక సంఘం అధికారులు వాణిజ్య దుకాణాలు, హోటళ్లు, తోపుడు బండ్ల విక్రయదారులకు అవగాహన కల్పించారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, పర్యావరణ ఇంజినీర్‌తో పాటు 6 మంది జవాన్లు, ఇద్దరు ఎన్జీవో సభ్యులు  ఉంటారు. పట్టణాల్లోని దుకాణాల్లో తనిఖీ చేస్తూ ప్లాస్టిక్‌ సంచులు విక్రయిస్తున్నారా లేదా తెలుసుకుంటారు. వారానికి ఒక సారి సమావేశమై అమలుపై చర్చిస్తారు.


ఎన్‌వైకే కీలక పాత్ర..

ప్రజా చైతన్యంలో.. ఎన్‌వైకే (నెహ్రూ యువ కేంద్రం) ముందు వరుసలో నిలుస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1128 యువజన సంఘాలు ఉండగా.. 16,700 మంది యువజనులు సభ్యులుగా ఉన్నారు. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా గతేడాది నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత అక్టోబరులో క్లీన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, పల్లెల్లో ఇంటింటా, ఆరుబయట ప్లాస్టిక్‌ను 20 వేల కిలోల వరకు సేకరించారు. ఇందులో 200 యువజన సంఘాలు సహా పంచాయతీ సిబ్బంది భాగస్వాములయ్యారు. సేకరించిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులను గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. 20 మంది వాలంటీర్లతో ఇంటింటా తిరిగి ప్రజా చైతన్యం తెచ్చారు. కరపత్రాలు పంపిణీ చేశారు. మహమ్మారితో కలిగే అనర్థాలను వివరించారు. కళాకారులు ఆటపాటల రూపంలో అవగాహన కల్పించారు. ఇంటింటికి 5 కిలోల చొప్పున ప్లాస్టిక్‌ను సేకరించేందుకు లక్ష్యంగా విధించుకున్నారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని