Afghan diplomat: దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్‌ దౌత్యవేత్త..!

అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్‌కు గురిచేసింది.

Updated : 04 May 2024 16:12 IST

ముంబయి: భారత్‌లోని అఫ్గానిస్థాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జకియా వార్ధక్‌ స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కున్నారు. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన ఆమె రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని భారత్‌కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. నిఘా వర్గాల సమాచారంతో ఆమెను అడ్డుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు.. ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడింది. ముంబయిలో ఏప్రిల్‌ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

వార్ధక్‌ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్‌ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్‌ ఛానల్‌ నుంచి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు లభించింది. అయితే, ఎయిర్‌పోర్టు ఎగ్జిట్‌ వద్ద డీఆర్‌ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. 

తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ఆమె వాటిని తోసిపుచ్చారు. దీంతో ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించారు. ఈ తనిఖీల్లో ఆమె ధరించిన జాకెట్‌, ప్యాంట్‌, మోకాలి క్యాప్‌, బెల్ట్‌లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమె కుమారుడి వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్‌ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. అయితే వార్ధక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదని అధికారులు వెల్లడించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అయితే, ఈ వార్తా కథనాలపై ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం తాను ముంబయిలో లేనని, వచ్చాక అన్ని విషయాలను వెల్లడిస్తానని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని