10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్‌ హడావుడి

తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. 

Updated : 04 May 2024 12:21 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ (Brij Bhushan) ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్‌ స్థానంలో ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ను భాజపా బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతోన్న తరుణంలో.. బ్రిజ్‌భూషణ్‌ స్థానికంగా తనకున్న పట్టును ప్రదర్శించారు. శుక్రవారం కరణ్‌ నామినేషన్‌ వేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన తన అనుచరగణంతో హడావుడి చేశారు. నామినేషన్‌కు ముందు నిర్వహించిన సభకు 10 వేలమంది హాజరయ్యారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్‌లు, భాజపా స్థానిక నేతలు, అయోధ్యలోని ప్రముఖ అఖాడాలకు చెందిన పెద్దలు ఉన్నారు. అలాగే 500-700 వరకు ఎస్‌యూవీలు మైదానంలో పార్క్‌ చేసినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇక వేదికపై అంతా కుర్చీల్లో కూర్చోగా.. బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం ఒక రాజువలే మధ్యలో ఒక సోఫాలో కూర్చున్నారు. చేతిలో మైక్రోఫోన్‌ పట్టుకొని అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ మొత్తం ప్రక్రియలో తన కుమారుడు, అలాగే యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మాత్రం దూరంగా ఉన్నారు. అలాగే కరణ్‌ నామినేషన్ వేసేప్పుడు కూడా కార్యాలయం లోపలకు వెళ్లలేదు. ‘‘లోపలికి వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంది. సాధారణంగా నేను ప్రచారానికి దూరంగా ఉంటాను. నేను మిగిలిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాను. ఇలా దూరంగా ఉండమని ఎలాంటి ఆదేశాలు అందలేదు’’ అని పేర్కొన్నారు. 

‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్‌ భూషణ్‌ కుమారుడికి టికెట్‌పై సాక్షి పోస్ట్‌

కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు పర్యాయాలుగా బ్రిజ్‌భూషణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో సాక్షి మలిక్‌, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‌ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో భాజపా హైకమాండ్‌ ఆయనను పక్కనబెట్టింది. కానీ, యూపీలో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకరిగా బ్రిజ్‌భూషణ్‌కు పేరుంది. భారీ సంఖ్యలో కేసులు ఉన్నప్పటికీ.. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించారు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాల్లో ఆయన హవా కనపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కైసర్‌గంజ్‌ స్థానంలో పార్టీ ఆయన కుమారుడికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని