logo

వన్యప్రాణులకు అభయమిద్దాం!

మనుషులతో పాటు జంతుజాలానికి భూమిపై జీవించే హక్కు ఉంది. ఈ విషయాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. ఆధునికత పేరుతో వన్యప్రాణులకు ముప్పు తలపెడుతున్నారు. అడవుల విస్తీర్ణం తగ్గడం, కాలుష్యం కారణంగా ఇప్పటికే చాలా రకాల వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి.

Published : 04 Oct 2022 02:56 IST

ప్రకృతి సమతుల్యతను కాపాడుదాం

ఈనెల 8 వరకు వారోత్సవాలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌, మనూరు

మంజీరా తీరంలో జింకలు..

మనుషులతో పాటు జంతుజాలానికి భూమిపై జీవించే హక్కు ఉంది. ఈ విషయాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. ఆధునికత పేరుతో వన్యప్రాణులకు ముప్పు తలపెడుతున్నారు. అడవుల విస్తీర్ణం తగ్గడం, కాలుష్యం కారణంగా ఇప్పటికే చాలా రకాల వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. ఇకనైనా ఆ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముంది. ఈ నెల 8 వరకు వన్య ప్రాణుల వారోత్సవాలు కొనసాగనున్న నేపథ్యంలో కథనం.

చట్టం ఏం చెబుతోందంటే..

వన్యప్రాణి చట్టం 2003, ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. జీవ, జంతు, వృక్షాలే కాకుండా చిన్నచిన్న క్రిమి కీటకాలు దీని పరిధిలోకి వస్తాయి. అభయారణ్యంగా గుర్తించిన ప్రాంతంలోకి ప్రవేశం, వేటాడటం నేరమని చట్టంలోని 9వ సెక్షన్‌ స్పష్టం చేస్తోంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ25వేల వరకు జరిమానా విధించవచ్చు.

పోచారం అభయారణ్యంలో..

హవేలిఘనపూర్‌: పర్యాటక ప్రాంతంగా పోచారం ఆభయారణ్యం గుర్తింపు పొందింది. జిల్లా కేంద్రం నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. జీవ వైవిధ్య కేంద్రంగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అభయారణ్యంలో జింకలు, నెమళ్లు, నీల్‌గాయ్‌లు వంటి వివిధ రకాల జంతువులు, పక్షులు కనువిందు చేస్తాయి. రెండేళ్ల క్రితం క్రితం ఏర్పాటు చేసిన వనవిజ్ఞాన కేంద్రంలో అడవిలోని  జంతువుల నమూనాలు, వివిధ రకాల వృక్షాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు.


మొసళ్ల పెంపకం

సంగారెడ్డి మండలం కల్పగూరు శివారులో మంజీరా జలాశయం ఉంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలకు తాగునీటి సరఫరాతోపాటు నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా దీన్ని నిర్మించారు. ఆ తర్వాత జలాశయం ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించారు. మొసళ్ల పెంపకానికి మంజీర అనువైన ప్రదేశంగా ఎంపికచేశారు. 1978 నుంచి ఇక్కడ మొసళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం 580 వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.


చిరుతలు.. హైనాలు.. మూషిక జింకలు

సిద్దిపేట: సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌, దుబ్బాక అటవీ రేంజ్‌లు జిల్లా పరిధిలో ఉన్నాయి. మొత్తం 19 మండలాల్లో 26 వేల హెక్టార్లలో అడవులు విస్తరించాయి. ఎలుగుబంట్లు, తోడేళ్లు, దుప్పులు, కొండగొర్రెలు, కృష్ణజింకలు, అడవిపందులు, కుందేళ్లు, నెమళ్ల సంచారం ఉంది. చిరుత పులి, హైనాల ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. మల్లన్నసాగర్‌ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం అడవులు కనిపిస్తాయి. సిద్దిపేట శివారు నాగుల బండ వద్ద తేజోవనం అర్బన్‌ ఫారెస్టులో అరుదైన మూషిక జింకల (మౌస్‌ డీర్‌) ఎన్‌క్లోజర్‌ను గత నెలలో ఏర్పాటు చేశారు.


సంరక్షణకు చర్యలు: శ్రీనివాస్‌, డీఎఫ్‌వో, సిద్దిపేట

వన్యప్రాణుల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. నీటి గుంతలు ఏర్పాటు చేశాం. వాటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాం. వాటికి ఆహారంగా పండ్ల మొక్కలు, ఇతరత్రావి పెంచుతున్నాం. వన్యప్రాణులకు హాని తలపెట్టకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మంటలను వ్యాపించకుండా జాగ్రత్తలు చేపట్టాం. సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. అంతరించిపోతున్న జాతులను పరిరక్షించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని