logo

విద్యుత్తు బిల్లుల షాక్‌

వారంతా పల్లె వాసులు. విద్యుత్తు సిబ్బంది ప్రతి నెలా ఇస్తున్న విద్యుత్తు బిల్లులను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విద్యుత్తు సిబ్బంది వచ్చి రూ.వేలల్లో బిల్లులు బకాయిలు పడ్డారంటూ నోటీసులు ఇవ్వడంతో గగ్గోలు పెడుతున్నారు.

Published : 05 Feb 2023 06:16 IST

వినియోగదారుల గగ్గోలు

మిర్యాలగూడ మండలం బోట్యానాయక్‌ తండాలో  ఓ వ్యక్తికి వచ్చిన రూ.41 వేల బిల్లు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: వారంతా పల్లె వాసులు. విద్యుత్తు సిబ్బంది ప్రతి నెలా ఇస్తున్న విద్యుత్తు బిల్లులను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విద్యుత్తు సిబ్బంది వచ్చి రూ.వేలల్లో బిల్లులు బకాయిలు పడ్డారంటూ నోటీసులు ఇవ్వడంతో గగ్గోలు పెడుతున్నారు. మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ విధంగా రూ.10వేల నుంచి రూ.లక్షకు పైగా బిల్లులు వేశారు. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. మిర్యాలగూడ మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో అదనపు బిల్లులు వేస్తూ తమ జేబులకు చిల్లులు పెడుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డబ్బా కొట్టుకు రూ.లక్ష బిల్లు

మిర్యాలగూడ మండలంలోని బోట్యానాయక్‌ తండాలో బాణోతు శంకర్‌ ఓ డబ్బా కొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అతడికి ప్రతి నెలా రూ.300 నుంచి రూ.400 వరకు విద్యుత్తు బిల్లు వస్తుండగా..క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు. ఇటీవల అధికారులు వచ్చి ఏకంగా రూ.1,08,000 బకాయి పడ్డావని చెప్పడంతో బాధితుడు కంగు తిన్నారు. అదే గ్రామానికి చెందిన బాణోతు నాగులు అనే ఆటో డ్రైవర్‌కు రూ.10,544, గూడూరుకు చెందిన హుస్సేన్‌కు రూ.8వేలు, రమావత్‌ రాముడుకు రూ.20వేలు ఇలా ప్రతి గ్రామంలోనూ అనేక మందికి రూ.వేలల్లో బిల్లులు ఇవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వివిధ రూపాల్లో మోతలు

జిల్లా వ్యాప్తంగా వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీలు, అదనపు ఛార్జీలు, తదితర రూపాల్లో బిల్లుల మోత మోగిస్తున్నారు. మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో గతంలో సిబ్బంది మీటర్‌ రీడింగ్‌ తప్పుగా నమోదు చేశారని.. ప్రస్తుతం యాప్‌ ద్వారా రీడింగ్‌ తీస్తుండడంతో పాత బకాయిలు చూపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మరో వైపు పలువురు వినియోగదారులకు ఏసీడీ బకాయి, మరి కొంత మందికి మాట్స్‌ (అనుమతి పొందిన లోడ్‌కు మించి విద్యుత్తు వాడినప్పుడు అధికారులు పట్టుకుని విధించే జరిమానా) బకాయిల పేరుతో అదనపు బిల్లులు వేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వినియోగదారులు విద్యుత్తు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు.


ప్రతి నెలా బిల్లు చెల్లిస్తున్నాం
- బాణోతు నాగులు, బోట్యానాయక్‌ తండా, మిర్యాలగూడ మండలం

నేను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. మాకు ప్రతి నెలా కనిష్ఠ బిల్లు వస్తుంది. విద్యుత్తు సిబ్బంది ఇచ్చిన బిల్లును క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. ఇప్పుడు అధికారులు వచ్చి మాకు రూ.10,544 బకాయి ఉందని..చెల్లించకపోతే సరఫరా నిలిపి వేస్తామని హెచ్చరించారు. మా తప్పేం లేకపోయినా అదనపు భారం మోపడం సరికాదు.


యాప్‌ బిల్లులతో పాత బకాయిలు
వెంకటేశ్వర్లు, విద్యుత్తు డీఈ, మిర్యాలగూడ

గతంలో కొందరు సిబ్బంది వినియోగదారుల ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో తప్పుడు రీడింగ్‌ నమోదు చేసి బిల్లులు ఇచ్చేవారు. దీంతో ఇటీవల కాలంలో జీపీఎస్‌ విధానం కలిగిన నూతన యాప్‌తో మీటర్‌ రీడింగ్‌ తీయడం వల్ల పాత తప్పులన్నీ బయటపడుతున్నాయి. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా బిల్లులను ఎక్కువ నెలలకు సర్దుబాటు చేస్తున్నాం. దీంతో టారిఫ్‌ విధానంలో భారీ మార్పులు తొలగిపోయి వినియోగదారులకు కొంత వెసులుబాటు లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు