logo

కలెక్టర్‌ చెప్పినా.. కదలని లిఫ్టులు.. రోగుల కష్టాలు

బోగోలు మండలంలోని బిట్రగుంటకు చెందిన ఓ వ్యక్తి కింద పడడంతో కాలికి గాయమైంది. చికిత్సకు జీజీహెచ్‌లో ఇన్‌పేషంట్‌గా చేర్చినప్పుడు స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాస్త తగ్గగానే డిశ్ఛార్జి చేశారు.

Published : 07 Jun 2023 04:33 IST

జీజీహెచ్‌లో పనిచేయని లిఫ్టులు

* బోగోలు మండలంలోని బిట్రగుంటకు చెందిన ఓ వ్యక్తి కింద పడడంతో కాలికి గాయమైంది. చికిత్సకు జీజీహెచ్‌లో ఇన్‌పేషంట్‌గా చేర్చినప్పుడు స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాస్త తగ్గగానే డిశ్ఛార్జి చేశారు. పూర్తిగా తగ్గకపోవడంతో నడిచేందుకు వీలు కావడం లేదు. ఈపరిస్థితుల్లో లిఫ్ట్‌లో వెళ్లేందుకు రాగా పనిచేయలేదు. ఇదేమిటని సిబ్బందిని అడిగితే.. ‘మమ్మల్ని అడిగితే ఏం చేస్తాం. అధికారులను అడగండి’ అంటూ దురుసుగా సమాధానం చెప్పారు. దీంతో మెట్లపై నుంచే కిందకు అతన్ని మోసుకురావాల్సి వచ్చిందని రోగి సహాయకురాలు వాపోయింది.  

* ఇవేం లిఫ్టులో ఒక రోజు పనిచేస్తాయ్‌.. రెండు రోజులు చేయవ్‌. ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రోగుల వార్డులోకి కిందకు తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతున్నాయి. ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందోనని ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు, నెల్లూరు : జిల్లా కేంద్రాసుపత్రిపై గత నెల 25వ తేదీన సమీక్ష నిర్వహించిన కలెక్టర్‌ హరినారాయణన్‌ ‘రోగులకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించండి. లిఫ్టులు, ఏసీలు సత్వరమే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురండి. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తాం’ అని స్పష్టంచేశారు. సాక్షాత్తూ జిల్లా పాలనాధికారి చెప్పినా వైద్యాధికారుల్లో మార్పు రాలేదు. సౌకర్యాలు మెరుగుపరచలేదు. రోగుల బాగోగులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆపదలో వచ్చిన వారు అష్టకష్టాలు పడుతున్నారు. ఆసుపత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 900 నుంచి 1200 వరకు వస్తుంటారు. 500 మంది ఇన్‌పేషంట్లుగా ఉంటారు. ఈస్థాయిలో రోగులు ఉంటున్నా  కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.  శస్త్రచికిత్సలు చేసేందుకు వెళుతున్న వైద్యులు, సిబ్బందితో పాటు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లిఫ్టు నిర్వహణకు కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలు రూ.లక్షల్లో ఉండడంతో  మరమ్మతులు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌, ప్రభుత్వం స్పందించి త్వరగా లిఫ్టులు పనిచేసేలా చూడాలని రోగులు కోరుతున్నారు.

* దీనిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా వి.సిద్ధానాయక్‌ను వివరణ అడిగేందుకు ఆసుపత్రికి వెళ్లగా అందుబాటులో లేరు. ఆ తర్వాత చరవాణి ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని