logo

నల్లత్రాచును తెచ్చారు!

సింగరాయకొండలో పదిహేడేళ్ల క్రితం జరిగిన మన్నం దేవీప్రసాద్‌ అలియాస్‌ మన్నం ప్రసాద్‌ హత్యకేసులో నయీమ్‌ ముఠాకు చెందిన నిందితుడు మద్దులూరి శేషయ్య అలియాస్‌ శేషన్నను పోలీసులు విచారణకు తీసుకువచ్చారు.

Published : 02 Dec 2022 03:00 IST

పోలీసుల విచారణలో నయీమ్‌ ముఠా సభ్యుడు శేషన్న
పదిహేడేళ్ల క్రితం బ్యాంకు ఉద్యోగి హత్యలో ప్రమేయం

శేషన్న, నయీమ్‌(పాతచిత్రాలు)

ఒంగోలు నేరవిభాగం, సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: సింగరాయకొండలో పదిహేడేళ్ల క్రితం జరిగిన మన్నం దేవీప్రసాద్‌ అలియాస్‌ మన్నం ప్రసాద్‌ హత్యకేసులో నయీమ్‌ ముఠాకు చెందిన నిందితుడు మద్దులూరి శేషయ్య అలియాస్‌ శేషన్నను పోలీసులు విచారణకు తీసుకువచ్చారు. నిందితుడు అనధికారికంగా ఆయుధాలను కలిగి ఉన్నాడన్న సమాచారంతో రెండు నెలల క్రితం తెలంగాణలోని గోల్కొండ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్కడి పోలీసులు శేషన్నను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు..విచారణ చేపట్టగా నిందితుడు 2005లో సింగరాయకొండలో జరిగిన బ్యాంకు ఉద్యోగి దేవీప్రసాద్‌ హత్యలో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ అంశంపై తెలంగాణ పోలీసులు స్థానిక సీఐ రంగనాథ్‌కు సమాచారం అందించారు. శేషన్నను విచారించాల్సి ఉందని ప్రకాశం పోలీసులు న్యాయస్థానంలో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో జైలు నుంచి సింగరాయకొండ తీసుకువచ్చారు. మూడు రోజులపాటు విచారించనున్నారు.


నాడు  ఏం జరిగిందంటే..

మన్నం ప్రసాద్‌ హత్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పీపుల్స్‌వార్‌ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో నల్లమల నల్లత్రాచుల పేరిట కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సింగరాయకొండలోని పీడీసీసీ బ్యాంకులో పెయిడ్‌ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న దేవీప్రసాద్‌ను 2005 సెప్టెంబర్‌ 10న బ్యాంకు వద్దనే అత్యంత కిరాతకంగా గొడ్డళ్లతో నరికిచంపారు. ప్రసాద్‌ మావోయిస్టులకు సహకరిస్తున్నందునే అంతమొందించామని ఒక లేఖ వదిలివెళ్లారు. అప్పటి అధికారులు కేసు దర్యాప్తు చేపట్టినా ఈ నల్లత్రాచులు ఎవరో తేల్చలేకపోయారు. చివరకు దీనికి పాల్పడింది నయీమ్‌ ముఠా అని 17 ఏళ్ల తర్వాత వెలుగుచూసింది. ఒకప్పుడు పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించిన నయీమ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి పోలీసులకే సవాల్‌ విసిరాడు. పోలీసులు అతనిని ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. తెలంగాణలో ఆ ముఠా అకృత్యాలపై విచారణ చేపట్టారు. కీలకంగా వ్యవహరించిన శేషయ్యను అదుపులోకి తీసుకోగా మన్నం ప్రసాద్‌ హత్య విషయం వెలుగుచూసింది. కాగా నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ అనంతరం శేషన్న నాగర్‌కర్నూల్‌ జిల్లా అంబడాబాద్‌ మండలం మన్ననూరు అంబేడ్కర్‌ నగర్‌ కాలనీలో మకాం పెట్టాడు. దందాలు నిర్వహిస్తూ అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నాడని, ఆయుధాలు కలిగి ఉన్నాడన్న అభియోగాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో సుమారు 30కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం. ప్రసాద్‌ హత్యలో నేరుగా పాల్గొన్న నిందితుల్లో కె.విజయ్‌కుమార్‌ మృతి చెందినట్లు తెలిసింది. శేషన్న సహ నిందితులు కుంట్లా యాదగిరి, కుంట్లా సత్యనారాయణ ఆచూకీ తెలియాల్సి ఉంది. శేషన్న నోరుమెదిపితే 17ఏళ్ల క్రితం జరిగిన హత్యకేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని