logo

దంపతులను వెంటాడిన మృత్యువు

వారిది నిరుపేద కుటుంబం. ఉదయాన్నే వివిధ ప్రాంతాల్లోని తటాకాల వద్దకు దంపతులిద్దరూ చేపల వేటకు వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తున్న వారిని విధి వెంటాడింది. మరో పదినిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ఢీకొన్నారు.

Published : 04 Dec 2022 05:23 IST

నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని దుర్మరణం

కనిగిరి, న్యూస్‌టుడే: వారిది నిరుపేద కుటుంబం. ఉదయాన్నే వివిధ ప్రాంతాల్లోని తటాకాల వద్దకు దంపతులిద్దరూ చేపల వేటకు వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తున్న వారిని విధి వెంటాడింది. మరో పదినిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన శనివారం రాత్రి కనిగిరి మున్సిపాలిటీ పరిధి మాచవరం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..

కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డికాలనీకి చెందిన రాపూరి వెంకటేశ్వర్లు (57), సుజాత (45) దంపతులకు చేపల వేటే ఆధారం. ప్రతి శనివారం వేటకు వెళ్లి వచ్చి వాటిని ఆదివారం విక్రయిస్తుంటారు. ఎప్పటిలానే తెల్లవారుజామున ఇంటికి తాళాలు వేసి ద్విచక్ర వాహనంపై పామూరు, నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో గల తటాకాల వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు చేపల వేట సాగించారు. సేకరించిన వాటిని పట్టుకొని తిరిగి వస్తుండగా మాచవరం జాతీయ రహదారిపై నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను చీకట్లో గమనించక ఢీకొన్నారు. ఆ వేగానికి ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై ట్రాక్టర్‌ కిందపడి మృతిచెందారు. ఎస్సై డి.ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్టర్‌ చోదకుడు పరారీలో ఉన్నాడన్నారు. కాగా ఈ దంపతులకు కుమార్తె లక్ష్మీదేవి, కుమారుడు బాలకృష్ణ ఉన్నారు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. వెంకటేశ్వర్లు గత నగర పంచాయతీ ఎన్నికల్లో తెదేపా తరపున వార్డు సభ్యుడిగా పోటీచేసి ఓటమిచెందారు. అందరితో కలిసిమెలసి ఉండే వీరి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సంతాపం తెలిపారు. తెదేపాలో ఆదినుంచి చురుకైన నాయకుడిగా వెంకటేశ్వర్లు ఉన్నారని ఉగ్ర అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని