logo

పథకం ప్రకారం దోపిడీ

గత నెల 29న రైల్వే న్యూకాలనీలో దౌర్జన్యం చేసి రూ.32 లక్షలు లాక్కెళ్లిపోయినట్లు అందిన ఫిర్యాదు అందిన సంఘటనలో పోలీసులు చిక్కుముడి విప్పారు. నిందితులను అరెస్టు చేయడమే కాకుండా ఫిర్యాదుదారుడిపై కూడా కేసు నమోదు చేయటం విశేషం. దీనికి సంబంధిం

Published : 05 Jul 2022 04:28 IST

నలుగురి అరెస్టు... రూ.11.85 లక్షల స్వాధీనం  

ఫిర్యాదుదారుపై కూడా కేసు

వివరాలు వెల్లడిస్తున్న ఏడీసీపీ గంగాధరం

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: గత నెల 29న రైల్వే న్యూకాలనీలో దౌర్జన్యం చేసి రూ.32 లక్షలు లాక్కెళ్లిపోయినట్లు అందిన ఫిర్యాదు అందిన సంఘటనలో పోలీసులు చిక్కుముడి విప్పారు. నిందితులను అరెస్టు చేయడమే కాకుండా ఫిర్యాదుదారుడిపై కూడా కేసు నమోదు చేయటం విశేషం. దీనికి సంబంధించి ఏడీసీపీ(క్రైమ్‌) గంగాధరం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రెడ్డిరాజునాయుడు గాజువాకలోని ఓ బంగారు తాకట్టు కార్యాలయంలో క్రెడిట్‌ హెడ్‌గా పనిచేస్తుంటాడు. దీంతో పాటు ఎవరికైనా అత్యవసరమైతే బంగారం తీసుకొని పరిచయం ఉన్న ఫైనాన్సియర్‌ ఆనంద్‌ వద్ద నగదు తీసుకుని అప్పులు ఇస్తుంటాడు. అయితే రైల్వేన్యూకాలనీకు చెందిన బీడబ్ల్యూ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని భీశెట్టి విలియమ్‌ ప్రసాద్‌ తన వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టుకొని అప్పు ఇవ్వాలంటూ రెడ్డిరాజునాయుడును సంప్రదించాడు. దీంతో రాజునాయుడు ఫైనాన్సియర్‌ ఆనంద్‌ వద్దకు వెళ్లి రూ.15లక్షలు నగదు తీసుకుని ప్రసాద్‌ వద్దకు వెళ్లాడు. ప్రసాద్‌ తన వద్ద ఉన్న 700 గ్రాముల బంగారాన్ని చూపించగా, దాన్ని విలువ కట్టాడు. ఆ బంగారానికి తన వద్ద ఉన్న రూ.15లక్షలు సరిపోవని, మళ్లీ ఆనంద్‌ వద్దకు వెళ్లి మరో రూ.15 లక్షలు తీసుకువచ్చాడు. అప్పటికే రాజునాయుడు వద్ద మరో రూ. రెండు లక్షలు ఉన్నాయి. బంగారం తీసుకుని డబ్బుల గురించి మాట్లాడుతుండగా ప్రసాద్‌ కార్యాలయంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు వచ్చి రాజునాయుడుని కొట్టి నగదు, బంగారం పట్టుకుని ప్రసాద్‌ను కొట్టుకుంటూ తీసుకువెళ్లిపోయారు. దీంతో రాజునాయుడు తనవద్ద ఉన్న రూ. 32 లక్షలు దుండగులు దోచుకెళ్లారని, ప్రసాద్‌ను కూడా వాళ్లతో తీసుకెళ్లిపోయారని నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
అయితే మరుసటి రోజు రెడ్డిరాజునాయుడు ఫైనాన్షియర్‌ ఆనంద్‌ వద్దకు వెళ్లి రూ. 32 లక్షలు పోలేదని.. కేవలం 16 లక్షలు మాత్రమే పోయాయని చెప్పి రూ. 15 లక్షలు ఆనంద్‌కు ఇచ్చేశాడు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన ఆనంద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు మరోసారి రెడ్డిరాజునాయుడిని విచారించారు. అయితే కొట్టి డబ్బు, బంగారం తీసుకెళ్లిపోయిన విషయం వాస్తవమేనని.. కాకపోతే పోయింది రూ. 15 లక్షలేనని ఫిర్యాదు దారుడు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు బిడబ్ల్యు యజమాని ప్రసాద్‌ గురించి దర్యాప్తు చేపట్టారు.

అతను తన కార్యాలయం బయటే పార్కింగ్‌ చేసి వెళ్లిపోయిన ద్విచక్రవాహనం గురించి వాకబు చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భీశెట్టి ప్రసాద్‌ ఓ ప్రణాళిక ప్రకారం తనకు పరిచయం ఉన్న హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమకు చెందిన నరేష్‌ అలియాస్‌ రుషిని సంప్రదించాడు. తనకు డబ్బులు అవసరమని చెప్పి తన ప్రణాళికకు సహకరించమని కోరాడు. దీంతో నరేష్‌ తనకు పరిచయం ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన షేక్‌ యూసఫ్‌, కొత్తగూడెంకు చెందిన షేక్‌ నజీర్‌లను విశాఖకు రప్పించాడు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం రెడ్డిరాజునాయుడు వచ్చి నగదు ఇస్తున్న సమయంలో పక్క నుంచి వచ్చి రాజునాయుడుతో పాటు ప్రసాద్‌ను కూడా కొట్టి నగదుతో పారిపోయినట్లుగా సినీ ఫక్కీలో ఓ పథకాన్ని రచించి దాన్ని అమలు చేశారు. సంఘటన తర్వాత నరేష్‌, షేక్‌ నజీర్‌, షేక్‌ యూసఫ్‌లు ఆటోలో గాజువాకకు వెళ్లిపోగా, తర్వాత ప్రసాద్‌ తన కారులో గాజువాకు వెళ్లి వారిని కలిసి కొంత నగదు అందజేసి ఎవరికి కనిపించకుండా ఉండాలని సూచించాడు. ఈనెల 3న ప్రసాద్‌ నరేష్‌కు ఫోన్‌చేసి ఆటోనగర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్దకు రావాలని చెప్పాడు. అందరూ అక్కడ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులకు సమాచారం రావటంతో నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.11.85 లక్షల నగదును, కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోయిన సొమ్ము కంటే ఎక్కువ చెప్పిన రెడ్డిరాజునాయుడుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని