logo

అధ్యాపకుల అనుచిత ప్రవర్తన

రేబాక పాలిటెక్నిక్‌లో ఇద్దరు అధ్యాపకులు విద్యార్థినుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని వేధించిన విషయం వెలుగులోకి వచ్చింది.

Published : 01 Apr 2023 06:59 IST

‘ఈనాడు’కు విద్యార్థినుల మొర

అనకాపల్లి పట్టణం/గ్రామీణం, న్యూస్‌టుడే: రేబాక పాలిటెక్నిక్‌లో ఇద్దరు అధ్యాపకులు విద్యార్థినుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని వేధించిన విషయం వెలుగులోకి వచ్చింది. మూడునెలల క్రితం కళాశాలలోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ (ఈసీఈ) విభాగంలో ఓ అధ్యాపకుడి తీరుపై ఓ విద్యార్థిని తన అన్నయ్య, వదినతో కలసి వచ్చి ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రిన్సిపల్‌ విచారణ చేయగా అధ్యాపకుడు తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తనపై అపవాదు వేస్తున్నారని లేఖ రాసిచ్చారు. దీంతో ఈ వ్యవహారం అప్పటికి సద్దుమణిగింది. ఇటీవల ఈ అధ్యాపకుడితోపాటు ఇదే విభాగంలో మరో అధ్యాపకుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, ల్యాబ్‌ టెస్ట్‌లో తప్పిస్తామని వేధిస్తున్నారంటూ బాలికలు ‘ఈనాడు’కు లేఖ రాశారు. సొంత పనులు చేయించుకోవడంతో పాటు విద్యార్థులను కొడుతున్నారని, దీంతో మానసికంగా కుంగిపోయి ఒక విద్యార్థి చదువు మానేశాడని లేఖలో పేర్కొన్నారు. ఈ ఇద్దరు అధ్యాపకులపై ఈసీఈ విభాగాధిపతికి రాతపూర్వకంగా తెలిపినా ప్రయోజనం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బీ దీనిపై కళాశాల ప్రిన్సిపల్‌ ఐ.వి.ఎస్‌.ఎస్‌.శ్రీనివాసరావును వివరణ కోరగా ఈసీఈ అధ్యాపకుడిపై ఓ విద్యార్థిని తన అన్నయ్య, వదినతో కలసి వచ్చి మూడు నెలల క్రితం ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై అధ్యాపకుడిని ప్రశ్నించగా తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారన్నారు. తాజాగా ఆ అధ్యాపకుడితోపాటు మరొకరు వేధిస్తున్నారంటూ విద్యార్థినులు చేసిన ఫిర్యాదుపై ప్రశ్నించగా, విచారణ చేపడతామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని