logo

వనదేవతల సన్నిధి నుంచి రేవంత్‌రెడ్డి పాదయాత్ర..

రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్రాల్లో హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Published : 05 Feb 2023 05:59 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్రాల్లో హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 6 నుంచి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సమ్మక్క సారలమ్మ మేడారం జాతరతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ నేపథ్యంలో వనదేవతల ఆశీర్వాదంతో పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

రెండ్రోజుల పాటు ములుగు జిల్లాలో..: ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొనే అవకాశం ఉంది. ములుగు జిల్లాలో రెండు రోజుల పాటు  పాదయాత్ర కొనసాగనుంది.  అనంతరం నర్సంపేట మీదుగా మహబూబాబాద్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర ఉంటుంది.


పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి: -ములుగు ఎమ్మెల్యే సీతక్క

సమావేశంలో మాట్లాడుతున్న సీతక్క

ములుగు, న్యూస్‌టుడే: పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలపెట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 6న మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధి నుంచి పాదయాత్ర ప్రారంభమై పస్రా, చల్వాయి, జంగాలపల్లి మీదుగా రామప్ప దేవాలయం వరకు మొదటి రోజు కొనసాగుతుందన్నారు. రెండోరోజు పాలంపేట నుంచి రామాంజపూర్‌, బుధ్దారం మీదుగా ములుగు చేరుకుంటుందని చెప్పారు. ఈ పాదయాత్రకు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళిరెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్‌, యూత్‌కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బానోత్‌ రవిచందర్‌, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని