logo

రోడ్డుపై చెట్టు విరిగిపడి యువకుడి దుర్మరణం

ఈదురుగాలుల బీభత్సానికి యువకుడు బలైన ఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 08 May 2024 04:30 IST

 దయాకర్‌(పాత చిత్రం)

 వర్ధన్నపేట, న్యూస్‌టుడే: ఈదురుగాలుల బీభత్సానికి యువకుడు బలైన ఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, స్థానికుల కథనం ప్రకారం.. ఇల్లంద గ్రామానికి చెందిన స్నేహితులు ఆబర్ల దయాకర్‌(22), నవీన్‌ ఇల్లంద నుంచి సంగెం మండలానికి ట్రాక్టరులో గడ్డి మోపులను తీసుకెళ్లారు. సాయంత్రం ఇల్లందకు తిరుగు పయనమయ్యారు. కట్య్రాల శివారు వరంగల్‌- ఖమ్మం జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈక్రమంలో ఒక్కసారిగా పెద్ద వృక్షం విరిగి ట్రాక్టరు ట్రాలీ(డబ్బా)లో ఉన్న ఆబర్ల దయాకర్‌పై పడింది. ఈ ప్రమాదంలో నవీన్‌ స్వల్పంగా గాయపడ్డాడు. దయాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గంమధ్యలో మృతిచెందారు. మృతుడు హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండే ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు జాతీయ రహదారిపై చెట్టు పడడంతో పెద్దఎత్తున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని వర్షంలోనే చెట్టు కొమ్మలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు