logo

Andhra News: మిస్టరీగా విద్యార్థినుల బలవన్మరణం

వీరు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనేది మిస్టరీగా మారింది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులనే విషయం చనిపోయేంత వరకు తమకు తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇరువురికి ఇంటి వద్ద ఎలాంటి సమస్యలు లేవు. చదువుల్లో ...

Updated : 02 Feb 2022 07:02 IST

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప రైల్వేస్టేషన్‌ పరిధి భాకరాపేట సమీపంలో సోమవారం రైలు పట్టాలపై పడి పూజిత(19), కల్యాణి(19) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వీరు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనేది మిస్టరీగా మారింది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులనే విషయం చనిపోయేంత వరకు తమకు తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇరువురికి ఇంటి వద్ద ఎలాంటి సమస్యలు లేవు. చదువుల్లో రాణిస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు లేవు. కడపకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరైనా వీరిని భయపెట్టారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్‌ కాల్‌డేటా వివరాలు తెలిస్తే ఆత్మహత్యల మిస్టరీ చిక్కుముడి వీడుతుందని పోలీసులు చెబుతున్నారు. సోమవారం అనంతపురంలో మరో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఆ ముగ్గురి ఆచూకీ తెలిసింది. వారితో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. విద్యాదీవెనకు సంబంధించి పని ఉందని కల్యాణి తాడిపత్రి నుంచి సొంతూరైన యాడికి మండలం కమలపాడు సచివాలయానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. పూజిత కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వచ్చింది. వీరిద్దరూ తాడిపత్రిలో సోమవారం ఉదయం 9.42 గంటలకు కర్ణాటక బస్సు ఎక్కి కడపలో దిగారు. కడప బస్టాండులో దిగిన తరువాత ఇరువురు సంతోషంగా స్వీయచిత్రం తీసుకున్నారు. తరువాత రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. 1.30 గంటలకు రైల్వేస్టేషన్‌లో సంచరించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. రాజంపేట వైపు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఇటు రాకూడదని చెప్పడంతో అక్కడ నుంచి ఆటోలో ఎర్రముక్కపల్లె రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లారు. పట్టాలపై నడుచుకుంటూ వస్తుండడం గూడ్స్‌ రైలు డ్రైవర్‌ చూసి వేగాన్ని తగ్గించడంతో వారు పట్టాలు దిగారు. తరువాత గూడ్స్‌ రైలు దగ్గరికి రాగానే ఇద్దరూ ఒక్కసారిగా రైలు పట్టాలపై పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూజిత మృతి చెందింది. బిడ్డల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. వీరిద్దరి మృతికి కారణాలు తెలియవని, సొంతూరికి వెళ్లాల్సిన కల్యాణి కడపకు ఎందుకు వచ్చిందో తెలియదని కల్యాణి బాబాయ్‌ బలరాం పేర్కొన్నారు. ‘పూజిత గత రెండు నెలల నుంచి ఒంటరితనానికి గురవుతుండేది. ఇంటి వద్ద ఎలాంటి గొడవలు లేవు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తెలియదు. కల్యాణి, పూజిత స్నేహితులనే విషయం ఇప్పటి వరకు మాకు తెలియదు’ అని పూజిత సోదరుడు నాగార్జున్‌ తెలిపారు. ‘ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. తమ సిబ్బందిని తాడిపత్రికి పంపించి వీరు చదివే కళాశాలలో విచారణ చేయిస్తున్నాం. ఫోన్‌ కాల్‌డేటా వివరాలు సేకరిస్తున్నాం’ అని కడప రైల్వే ఎస్సై రారాజు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని