icon icon icon
icon icon icon

INDIA: కాంగ్రెస్‌ ‘ఒంటెద్దు పోకడ’ కొంపముంచిందా..? ఇండియా కూటమి విసుర్లు

కేంద్రంలో భాజపాను ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా (INDIA) కూటమి భాగస్వామ్య పార్టీలు.. కాంగ్రెస్‌ తీరును తప్పుపడుతున్నాయి.

Published : 03 Dec 2023 22:44 IST

దిల్లీ: పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాంగ్రెస్‌ పార్టీ పేలవమైన ప్రదర్శన చూపించింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకోలేకపోగా.. ఇటు మధ్యప్రదేశ్‌లోనూ అవకాశాన్ని కోల్పోయింది. కేవలం తెలంగాణలోనే సానుకూల ఫలితం సాధించింది. దీంతో కేంద్రంలో భాజపాను ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా (INDIA) కూటమి పార్టీలు కాంగ్రెస్‌ తీరును తప్పుపడుతున్నాయి. విపక్షాల మద్దతు తీసుకోకుండా ఒంటెద్దు పోకడతో వెళ్లడంతోనే పలు రాష్ట్రాల్లో (Congress) ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వచ్చిందని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ‘ఆత్మపరిశీలన’ చేసుకొని.. భాగస్వామ్య పక్షాలతో కలిసి నడవాలని సూచిస్తున్నాయి.

కూటమిపై ప్రభావం చూపుతుందా..?

మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెందడం ‘ఇండియా’ కూటమిపై ప్రభావం చూపదని ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, జేడీయు నేత కేసీ త్యాగి పేర్కొన్నారు. భాగస్వామ్య పక్షాలను దూరంగా పెట్టి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడంతోనే కాంగ్రెస్‌ ప్రతికూల ఫలితాలు చూసిందని కేసీ త్యాగి విమర్శించారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే సమయంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఎంతో అవసరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గెలిచామని, తమను ఎవ్వరూ ఓడించలేరనే ధీమాతో వెళ్లడమే కాంగ్రెస్‌ పతనానికి దారితీసిందన్నారు.

సంప్రదాయానికే జై.. రాజపుత్రుల కోటలో ‘కాషాయం’ రెపరెపలు!

మూడు రాష్ట్రాల ఫలితాలు భాజపా విజయం కాదని.. అది కాంగ్రెస్‌ వైఫల్యమేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత కునాల్‌ ఘోష్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భాజపాను ఓడించేందుకు తృణమూల్‌ తనవంతు కృషి చేస్తుందన్నారు. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి.. ఇండియా కూటమిలో ‘కాంగ్రెస్‌’ ప్రాధాన్యం పెంచుకోవాలని చూసిందని ఇండియా కూటమికి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. అందుకే చాలాకాలంగా ఇండియా కూటమికి కాంగ్రెస్‌ దూరంగా ఉందన్నారు. ఈ క్రమంలో తాజా ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనా తీరులో మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

కలిసి వెళ్తే ఫలితం మారేది!

మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లాలని సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నించినప్పటికీ.. కమల్‌నాథ్‌ తీరుతో అదికాస్త విఫలమైంది. దీంతో ఆ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఎస్పీ అధికార ప్రతినిధి మనోజ్‌ యాదవ్‌.. తమపై అవమానకర వ్యాఖ్యలు చేయడం వల్లే కాంగ్రెస్‌ భారీగా దెబ్బతిందని అన్నారు. ఇదే విషయంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. ఎస్పీతో కలిసి వెళ్తే మధ్యప్రదేశ్‌ ఫలితం వేరేలా ఉండేదన్నారు. మిత్రపక్షాల విషయంలో తన దృక్పథాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, తాజా ఫలితాలు మాత్రం కూటమిలో ఎటువంటి చీలక తేదని సంజయ్‌ రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు.

6న ఇండియా భేటీ

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల కూటమి ‘ఇండియా’ లోని సమన్వయ కమిటీ కేవలం ఒకేసారి (సెప్టెంబర్‌ 13న) భేటీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఇటువంటి సమావేశాలు మరిన్ని పెట్టాలని నిర్ణయించినప్పటికీ.. పలువురు కాంగ్రెస్‌ నేతల విముఖతతో అది కాస్త వాయిదా పడింది. తాజాగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ.. మరో భేటీకి ఇండియా కూటమి సిద్ధమైంది. డిసెంబర్‌ 6న మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కావాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img