icon icon icon
icon icon icon

ప్రచారంలో బలగం

ఇన్నాళ్లూ ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న పలువురు సీనియర్‌ నేతలు.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ వారసులకూ రాజకీయ పునాది వేయాలని నడుంబిగించారు.

Updated : 30 Apr 2024 22:46 IST

లోక్‌సభ బరిలో వారసుల గెలుపే లక్ష్యంగా సీనియర్లు
తోడుగా కుటుంబసభ్యులు, బంధుగణం

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్నాళ్లూ ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న పలువురు సీనియర్‌ నేతలు.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ వారసులకూ రాజకీయ పునాది వేయాలని నడుంబిగించారు. వారి రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటాలని శ్రమిస్తున్నారు. మొన్నటి దాకా వారసులకు టికెట్లు ఇప్పించడంలో చాణక్యం ప్రదర్శించిన వీరు.. ఇప్పుడు వారి గెలుపు కోసమూ చక్రం తిప్పుతున్నారు. పగలు మండుటెండలో ప్రచారం.. అర్ధరాత్రి దాకా రాజకీయ మంతనాలతో పట్టుదలగా పనిచేస్తున్నారు. తమ కుటుంబసభ్యులు తొలిసారి ఎన్నికల బరిలో దిగినందున ఓటమి పాలైతే వారి రాజకీయ ప్రస్థానంపై నీలినీడలు పడే ప్రమాదముందని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ నుంచి ఆశించకుండా.. సొంతంగా పెద్దఎత్తున నిధులను సైతం ఖర్చు చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి తమకున్న పలుకుబడి మొత్తాన్నీ ఉపయోగిస్తున్నారు. 

తామే అండదండలుగా...

  • నల్గొండలో సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డికి, పెద్దపల్లిలో ఎమ్మెల్యే వివేక్‌ కొడుకు గడ్డం వంశీకృష్ణకు వరంగల్‌లో ఎమ్మెల్యే కడియం కూతురు కావ్యకు, మల్కాజిగిరిలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సతీమణి సునీతకు కాంగ్రెస్‌ లోక్‌సభ టికెట్లు ఇచ్చింది.
  • నాగర్‌కర్నూల్‌లో భారాసకు చెందిన సిటింగ్‌ ఎంపీ రాములు భాజపాలో చేరి తన కొడుకు భరత్‌కు లోక్‌సభ టికెట్‌ ఇప్పించుకున్నారు.
  • ఇదే నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవి కూడా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు స్వయానా సోదరుడు.
  • వీరిలో అధిక శాతం మంది అధికార కాంగ్రెస్‌కు చెందిన వారే కావడంతోపాటు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలుస్తున్నందున ఈ స్థానాలపై పార్టీ సైతం ప్రత్యేక దృష్టి పెట్టింది.
  • జానారెడ్డి ఆరోగ్య కారణాలతో కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో తిరగడం లేదు. ఈ ఎన్నికల్లో మాత్రం మండుటెండలను సైతం లెక్క చేయకుండా కుమారుడి విజయం కోసం నల్గొండ కేంద్రంగా శ్రమిస్తున్నారు. బుధవారం సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు సైతం వెళ్లి తన కుమారుడి విజయానికి మద్దతివ్వాలని వారిని అభ్యర్థించారు.
  • మరో సీనియర్‌ నేత వివేక్‌ తన కుమారుడి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. వివేక్‌ సోదరుడు వినోద్‌ కూడా ఎమ్మెల్యే కావడంతో అన్నదమ్ములిద్దరూ తమ వారసుడి కోసం ప్రచారం చేస్తున్నారు.  
  • ఇక సీనియర్‌ నేత కడియం శ్రీహరి వైద్యురాలైన తన కూతురు కావ్యను రాజకీయాల్లో వేలుపట్టి నడిపిస్తున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ భారాసలో ఉండి, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరినందున ఈ పార్టీ నేతలందరినీ కలుపుకొని పోవడానికి గట్టిగా కృషి చేస్తున్నారు.
  • మల్కాజిగిరిలో పోటీ చేస్తున్న సునీతారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేసినందున ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవముంది. అయినా ఆమె భర్త పట్నం మహేందర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తూ నేతలను కలుస్తూ సతీమణి విజయం కోసం కష్టపడుతున్నారు.
  • నాగర్‌కర్నూల్‌ భాజపా అభ్యర్థి భరత్‌ ఇప్పటికే కల్వకుర్తి మండల జడ్పీటీసీ సభ్యుడు. రాజకీయాలకు కొత్త కాకున్నా పెద్ద ఎన్నికలు కావడంతో ఆయన తండ్రి, ప్రస్తుత ఎంపీ రాములు అండగా నిలుస్తున్నారు.

కుటుంబసమేతంగా రంగంలోకి..

లోక్‌సభ నియోజకవర్గం అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సమాహారం. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఓటర్లను చేరడం కష్టంతో కూడుకున్నది. దీంతో కుటుంబసభ్యులు, బంధుగణాన్ని రంగంలోకి దించుతున్నారు. రోజూ తలో దిక్కుకెళ్లి ప్రచారం చేసేలా ప్రణాళిక చేసుకుంటున్నారు. ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతుగా ఆయన సతీమణి వినీలారావు, కుమారులు వినీత్‌రావు, వినయ్‌రావు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణకు డప్పు వాయించడంలో నేర్పరి అయిన పెద్ద కుమారుడు విప్లవ్‌కుమార్‌, గాయకుడైన చిన్న కుమారుడు సాయుధ విజయ్‌కుమార్‌ అన్నీ తామై నిలుస్తున్నారు. ప్రచారంలో వారి కళలను ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వరంగల్‌ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌కు ఆయన బామ్మర్ది సుదర్శన్‌ భుజం కాస్తున్నారు. మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయానికి ఆయన సతీమణి జమున, కోడలు క్షమిత ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించే వీరు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా రాజకీయాలపై దృష్టిసారించారు. చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి సతీమణి సీతారెడ్డి మద్దతుగా నిలుస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా ఉంటారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఆయన కొడుకు ఆర్యన్‌రెడ్డి సైతం ప్రస్తుతం విరామం తీసుకుని రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరఫున ఆయన సతీమణి సంగీతారెడ్డి క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యాపార కార్యక్రమాలతో నిత్యం తీరికలేకుండా ఉండే ఆమె.. ప్రస్తుతం మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు గడపగడపా తడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img