icon icon icon
icon icon icon

KTR: హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం: కేటీఆర్‌

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకొనే శక్తి భారాసకే ఉందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 

Published : 28 Apr 2024 16:32 IST

వేములవాడ: హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకొనే శక్తి భారాసకే ఉందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వేములవాడ నియోజకవర్గం బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో పాటు కేటీఆర్‌ పాల్గొన్నారు.‘‘2014లో బడా భాయి మోసం చేసి ఓట్లు దండుకున్నారు. జన్‌ధన్‌ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి రూ.15లక్షలు ఖాతాలో వేస్తామని ఓట్లు వేయించుకున్నారు. 2024లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చోటా భాయి మోసం చేశారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీ.. పదేళ్లలో ప్రజలను మోసం చేశారు. డీజిల్‌, పెట్రోల్‌ సహా నిత్యావసరాల ధరలు పెంచేశారు. రహదారుల నిర్మాణం కోసం సెస్‌ వసూలు చేసిన మోదీ.. మళ్లీ ఇప్పుడు టోల్‌ రుసుము పేరుతో ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలి. అలా రూ.30లక్షల కోట్లు వసూలు చేసి .. అందులో నుంచి రూ.14.50 లక్షల కోట్లు అదానీ, అంబానీ లాంటి వారందరి రుణాలన్నీ మాఫీ చేశారు.

కరీంనగర్‌లో భాజపా, భారాస మధ్యే పోటీ. ఎందుకంటే టికెట్‌ విషయంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ పార్లమెంట్‌ టికెట్‌ను ప్రవీణ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఆశించారు. కానీ, వారిద్దరిలో ఎవరికి ఇచ్చినా గట్టి పోటీ ఉంటుందని, ఇదే జరిగితే వినోద్‌ బయట పడతాడన్న ఉద్దేశంతో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని నిలబెట్టారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో కరీంనగర్‌కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో 10.. 12 ఎంపీ సీట్లు భారాసకు వస్తే కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలోపే వస్తుంది. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా, కుమార్తె జైల్లో ఉన్నా, నమ్మినవాళ్లు మోసం చేసి వేరే పార్టీల్లోకి వెళ్తున్నా.. కేసీఆర్‌ బస్సుయాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారు. తల్లిలాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు పక్కన పెట్టి ఎండను లెక్క చేయకుండా ముందుకు రావాలి’’ అని కేటీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img