అంతిమ సంస్కారాలకు అంతులేని కష్టం

కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూసిన వారి అంతిమ సంస్కారాల కోసం వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మృతదేహాన్ని శవాగారం నుంచి శ్మశానానికి తరలించాలంటే పైసా లేనిదే పని జరగడం లేదు....

Published : 02 May 2021 01:42 IST

ఇష్టారీతిలో దండుకుంటున్న ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లు

నిజామాబాద్‌: కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూసిన వారి అంతిమ సంస్కారాల కోసం వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మృతదేహాన్ని శవాగారం నుంచి శ్మశానానికి తరలించాలంటే పైసా లేనిదే పని జరగడం లేదు. ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లు సిండికేట్‌గా మారి మృతుల కుటుంబసభ్యుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి తరలించేందుకు కిలోమీటర్‌కు రూ.1000 చొప్పున వసూలు చేస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క అంబులెన్స్‌ మాత్రమే ఉంది. కానీ మరణాలు రోజుకు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబాలకు మృతదేహాన్ని తరలించడం ఇబ్బందిగా మారింది. 

ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లు మానవత్వం మరిచి రాబందుల్లా ప్రవర్తిస్తున్నారు. సిండికేట్‌గా మారి కిలోమీటరుకు రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొందరు మృతుల కుటుంబసభ్యులతో ప్యాకేజీల పేరుతో బేరసారాలకు దిగుతున్నారు. ఆసుపత్రి నుంచి శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు జరిపించేందుకు రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. దూరం పెరిగే కొద్దీ ఈ ప్యాకేజీల ధర అమాంతం పెంచేస్తున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి శ్మశానవాటికకు తరలించేందుకు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయా కుటుంబాలు గత్యంతరం లేక అంబులెన్స్‌ డ్రైవర్లు అడిగినంత చేతిలో పెట్టి అంత్యక్రియలకు తరలిస్తున్నారు. కరోనాతో మృతిచెందిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రభుత్వమే ముందుకురావాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ అంబులెన్స్‌లను పెంచాలని కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని