ఏపీలో నవంబర్‌ 2నుంచి పాఠశాలలు ప్రారంభం

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

Published : 21 Oct 2020 01:33 IST

మార్గదర్శకాలు జారీ చేసిన సీఎం జగన్‌

అమరావతి: సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నవంబర్‌ 2వ తేదీ నుంచి పాఠశాలను పునఃప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం స్పందించారు. నవంబరు 2 నుంచి పాఠశాలల్లో రోజువిడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.

పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు. 1, 3, 5, 7వ తరగతుల విద్యార్థులకు ఒక రోజు.. 2, 4, 6, 8వ తరగతుల విద్యార్థులకు మరో రోజు తరగతులు నిర్వహించాల్సిందిగా సీఎం ఆదేశించారు. పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరించినట్లయితే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని.. 750కి తక్కువగా ఉన్నట్లయితే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం విధిగా అమలు చేయాలని ఆదేశించారు. నవంబరు మొత్తం ఒకపూటే తరగతులు నిర్వహిస్తామని.. పాఠశాలల నిర్వహణ వేళలపై పరిస్థితి మేరకు డిసెంబరులో మరోసారి నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని