TS News: నలుగురు ఐఏఎస్‌లతో పాలనా సంస్కరణల కమిటీ: సీఎం కేసీఆర్‌

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో..

Updated : 16 Jan 2022 21:37 IST

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని స్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి సూచనలు ఇచ్చేందుకు నలుగురు ఐఏఎస్‌ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ఐజీ అండ్‌ కమిషనర్‌ శేషాద్రి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ కమిటీలో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యలను సభ్యులుగా నియమించారు. 

ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.  రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా.. 101 మంది మినహా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో చేరిపోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్‌ జారీచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, జిల్లా పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును ఇంకా మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి నివేదిక అందించాలని సీఎం ఈ కమిటీకి సూచించారు. ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్‌ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త జిల్లాల్లో, కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఏయే శాఖలకు పని ఒత్తిడి ఎంత ఉందో అంచనా వేసి దానికి అనుగుణంగా ఇంకా కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం, కొత్తగా సాంకేతికంగా ఏమేం చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇంకా మెరుగైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు అద్భుతమైన సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రజలకు నిత్యం ఎక్కువగా అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంలో తగు సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ ఈ కమిటీకి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎంవో అధికారులు శేషాద్రి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని