Viveka Murder case: వైఎస్ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు 31కి వాయిదా
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్పై తీర్పును ఈనెల 31కి వాయిదా వేసింది.
హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ నిన్న, ఈరోజు వాదనలు విన్నారు. శుక్రవారం ఎంపీ అవినాష్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించారు. శనివారం సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
‘‘అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు. కేసు దర్యాప్తులో మొదటి నుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్లు కాదు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. నోటీసు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరుకావడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎంతో మందిని విచారించాం.. కొందరిని అరెస్టు చేశాం. మిగతావారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాష్కు ఏమిటి? కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ అవినాష్ జాప్యం చేస్తున్నారు’’ అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సామాన్యుల కేసుల్లోనూ ఇంత సమయం తీసుకుంటారా? అని సీబీఐ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారని.. ప్రధాన కారణమేంటి?అని ప్రశ్నించింది. దీనిపై సీబీఐ స్పందిస్తూ.. ‘‘రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణం. హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైంది. అవినాష్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి. కడప ఎంపీ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు. వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాష్ భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనక కుట్ర జరిగింది’’ అని కోర్టుకు తెలిపారు.
వారి నుంచి ఏం తెలుసుకున్నారు?: హైకోర్టు
‘‘భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టుకు కారణాలేంటని.. వారి నుంచి ఏం తెలుసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. ‘‘కుట్రలో ప్రమేయం దృష్ట్యా భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డిని అరెస్టు చేశాం. కస్టడీ విచారణకు వారిద్దరూ సహకరించడం లేదు. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్ కుట్ర అమలు చేశారు. వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగి హత్య చేయించారు. శత్రువుకి శత్రువు మిత్రుడనే విధానం అనుసరించారు. అవినాష్ రెడ్డి నుంచే డబ్బులు వచ్చాయని దస్తగిరి చెప్పాడు. అవినాష్ డబ్బులు శివశంకర్రెడ్డికి ఇస్తే.. ఆయన గంగిరెడ్డికి ఇచ్చాడు. రూ.4 కోట్లు ఖర్చు చేయడానికి శివ శంకర్రెడ్డికి ఏం అవసరం?’’ అని సీబీఐ తెలిపింది.
గాయాలు చూస్తే హత్య అని ఎవరైనా చెబుతారు: హైకోర్టు
గదిలో రక్తం కడిగేసి సాక్ష్యాలు చెరిపేశారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ‘‘గాయాలు చూస్తే హత్య అని ఎవరైనా చెబుతారు. గదిలో రక్తం తుడిచేస్తే సాక్ష్యాలకు నష్టమేంటి?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ స్పందిస్తూ.. ‘‘శివశంకర్ రెడ్డి చెప్పినట్టుగానే ఎం.వి.కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో రక్తపు మరకల విషయాన్ని కృష్ణారెడ్డి ప్రస్తావించలేదు. శివశంకర్ అంటే ఉన్న భయంతోనే సీఐ శంకరయ్య వాస్తవ పరిస్థితిని నమోదు చేయలేదు’’ అని పేర్కొంది.
అవినాష్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారా?: హైకోర్టు
‘‘హత్య జరిగిన రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వాట్సప్లో ఎవరితో మాట్లాడారు? అవినాష్ వాట్సప్లో ఉన్న సమయంలో గంగిరెడ్డి వాట్సప్ కూడా బిజీగా ఉందా? భారీ కుట్రలో అవినాష్ ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఎప్పటినుంచో అనుమానిస్తోంది కదా. మరి అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారా?కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ స్పందిస్తూ.. ‘‘వాట్సప్ కాల్ మాట్లాడినట్టు మాత్రమే తెలుస్తోంది. అయితే, ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేం. ఎవరితో మాట్లాడారో తెలుసుకునేందుకే అవినాష్ను విచారించాలని అనుకుంటున్నాం. ఈనెల 12న అవినాష్ రెడ్డి ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డు) డేటా సేకరించాం’’ అని సీబీఐ వెల్లడించింది.
బుధవారం అవినాష్ను విచారణకు పిలుస్తాం: సీబీఐ
‘‘హత్య జరిగిన రోజు అవినాష్ జమ్మలమడుగు వెళ్తున్నట్లు చెప్పారు. అవినాష్ తప్పుడు సమాచారం ఇచ్చారు. జమ్మలమడుగులో ఆరోజు అవినాష్ ఎన్నికల షెడ్యూల్ లేదు. అనుచరుల ద్వారా అవినాష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. అవినాష్ రెడ్డి వల్ల సాక్షులు ముందుకు రావడం లేదు. కొందరు కీలక సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. సీల్డ్ కవర్లో సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పిస్తాం’’ అని సీబీఐ తెలిపింది. న్యాయస్థానం స్పందిస్తూ.. ‘‘వాంగ్మూలాల వివరాలను పిటిషనర్కు కూడా ఇస్తారా?’’ అని ప్రశ్నించింది. సీబీఐ స్పందిస్తూ.. ‘‘సాక్షుల వివరాలు ప్రస్తుత దశలో బయట పెట్టలేం. ఈ దశలో సాక్షుల వివరాలు బయటపెడితే వారి ప్రాణాలకే ముప్పు. బుధవారం అవినాష్ను విచారణకు పిలుస్తాం’’ అని సీబీఐ వివరించింది. అలాగైతే.. వాంగ్మూలాలపై అవినాష్ వాదనలు వినకుండా ఎలా పరిగణనలోకి తీసుకోగలమని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువైపుల వాదనలు వినాలన్న సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం కాదా? అని నిలదీసింది.
ఈనెల 31కి తీర్పు వాయిదా
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం 2 గంటలకు సీబీఐ వాదనలు ముగిశాయి. అనంతరం సీబీఐ వాదనలకు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది రిప్లై వాదనలు వినిపించారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకా ఓటమితో అవినాష్కు ఏం సంబంధం? ఓటర్లు.. ఓట్లు వేయకపోవడం వల్లే వివేకా ఓడిపోయారు. అవినాష్ తల్లి హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు అవినాష్పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా