పోలీసు అధికారిణిని కదిలించిన పసిబిడ్డ ఆకలి

కరోనా కల్లోలం, గల్వాన్‌ లోయ వద్ద ఆర్మీ జవాన్ల మరణం..మనసును మూడీగా మారుస్తున్న తరుణంలో ఊరడించే కొన్ని సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.

Published : 19 Jun 2020 01:25 IST

రాంచి: కరోనా కల్లోలం, గల్వాన్‌ లోయ వద్ద ఆర్మీ జవాన్ల మరణం..మనసును మూడీగా మారుస్తున్న తరుణంలో ఊరడించే కొన్ని సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటే ఝార్ఖండ్‌ రాజధాని రాంచిలోని హతియా రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కి చెందిన ఓ కుటుంబం శ్రామిక రైల్లో బెంగళూరు నుంచి బయలుదేరింది. వారితో పాటు నాలుగు నెలల చిన్నారి కూడా ఉంది. ఆ బిడ్డకు పాలు పట్టే సమయమైంది. బాబుకు పాలు కొనడం కోసం రైలు ఎప్పుడు ఆగుతుందా అని ఆ తల్లి ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రైలు హతియా స్టేషన్ వద్దకు వచ్చి, ఆగింది. వెంటనే ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారుల వద్దకు వచ్చి పిల్లాడి కోసం కొన్ని పాలు తెప్పించమని అభ్యర్థించారు. ఆమె అధికారులతో మాట్లాడుతుంటే అక్కడే ఉన్న ఏఎస్‌ఐ సుశీలా బరైక్ గమనించారు. సుశీల ఇల్లు కూడా స్టేషన్‌కు దగ్గర్లోనే ఉండటంతో..ఆ తల్లి కష్టం తెలియగానే వెంటనే ఇంటికి పరిగెత్తారు. వెంటనే బాటిల్ నిండుగా పాలు తెచ్చి, ఆమెకు ఇచ్చారు. ఈ విషయమంతా  డీఆర్‌ఎం దృష్టికి చేరింది. వెంటనే ఈ మంచి సంఘటనను అందరింతో పంచుకోవాలని, చిన్నారి తల్లికి బాటిల్ ఇస్తోన్న సమయంలో తీసిన చిత్రాన్ని ట్విటర్‌లో పోస్టు చేశారు. అలా ఆ ఏఎస్‌ఐ ఉదారస్వభావం వెలుగులోకి వచ్చింది. 

గత నెలలో కూడా భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రైలు ఆగిన వెంటనే అందులో  ఉన్న ఓ మహిళ తన పసిబిడ్డకు పాలు తెమ్మని ఓ రైల్వే కానిస్టేబుల్‌ను కోరారు. కానీ, ఆయన తెచ్చేలోపే రైలు కదలడం ప్రారంభమైంది. కానీ, ఎలాగైనా ఆ ప్యాకెట్ ఆమెకు అందించాలని ఒక చేత్తో రైఫిల్, మరో చేత్తో పాల ప్యాకెట్ పట్టుకొని ఒక అథ్లెట్‌లా పరిగెత్తారు. ఎట్టకేలకు ఆమెకు పాలు అందించి, చిన్నారి ఆకలి తీర్చడానికి సహకరించారు. అదంతా అక్కడి సీసీకెమెరాల్లో రికార్డయింది. ఆయన సేవాగుణాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రత్యేకంగా ప్రస్తావించి, నగదు బహుమానాన్ని ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని