HYD- విశాఖ మార్గానికి కేంద్రం పచ్చజెండా!

హైదరాబాద్‌-విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా

Updated : 10 Jul 2021 08:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌-విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది. సుమారు 158 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గాన్ని పూర్తిచేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరుగుతుంది. ఈ రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించటం తెలిసిందే. తెలంగాణ నుంచి కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులకు సరకు రవాణాకూ ఈ మార్గం ఉపకరిస్తుంది. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ రహదారి అందుబాటులో ఉంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు ఫోర్‌ లేన్‌ విస్తరణ పనులు సాగుతున్నాయి. ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు రహదారిని 4 వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అక్కడి నుంచి విశాఖ వరకు ఇప్పటికే 4 వరుసల మార్గం ఉంది. ప్రణాళిక మేరకు  పనులన్నీ పూర్తయితే హైదరాబాద్‌ నుంచి దేవరాపల్లి మీదుగా విశాఖకు 625 కి.మీ. మార్గం 4 వరుసలుగా విస్తరించినట్లు అవుతుంది. ఖమ్మం నుంచి దేవరాపల్లి మార్గానికి నంబరు కేటాయించటంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే భూ సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశాలున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని