ప్రజల్లోకి సంక్షేమ ప్రగతి నివేదికలు: కేటీఆర్‌

రాష్ట్రం సాధించుకున్నాక దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను దశ వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు

Updated : 30 Nov 2022 06:32 IST

పాఠశాలలో చేపట్టిన పనులను మంత్రికి వివరిస్తున్న డీఈవో రాధాకిషన్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్రం సాధించుకున్నాక దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను దశ వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక వర్గాల వారీగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్తు, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం దేశానికి తలమానికంగా నిలుస్తోందన్నారు. వైశాల్యంలో చిన్న జిల్లా అయినా రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే దీటుగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. జిల్లాలో ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని పారదర్శకంగా ప్రజలకు తెలియజేసేందుకు కలెక్టర్‌ నేతృత్వంలో ప్రగతి నివేదికలు రూపొందించాలని సూచించారు. వీటి రూపకల్పనలో అధికారులతో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. వచ్చే నెలాఖరులోగా ఒక్కో రంగానికి సంబంధించి జిల్లాలో ఎంపిక చేసిన మండలంలో ప్రత్యేకంగా వేలాది మందితో సమావేశాలు నిర్వహించి ప్రతి వ్యక్తికి ప్రగతి నివేదికల ప్రతులను అందజేస్తామన్నారు. వైశాల్యం పరంగా చిన్న జిల్లా అయినా మిగతా జిల్లాల కంటే దీటుగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. జిల్లాలో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను డిసెంబరు, జనవరిలో రెండు విడతల్లో పంపిణీ చేయాలన్నారు.

నాణ్యమైన విద్యఅందించాలి

వేములవాడ: వేములవాడ మండలం అగ్రహారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని మండల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను మంగళవారం మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. రెండు పాఠశాలల్లో రూ.68.18 లక్షలో చేపట్టి పనులను డీఈవో రాధాకిషన్‌ మంత్రికి వివరించారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వసతులు కల్పించాలని మంత్రి సూచించారు. పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను చూసి విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, సిరిసిల్ల, వేములవాడ పురపాలక సంఘం అధ్యక్షులు మాధవి, జిందం కళ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, ఆర్డీవోలు శ్రీనివాసరావు, పవన్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్లు సమ్మయ్య, అన్వేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని