పీఎం గారూ.. నా డిగ్రీ పట్టా ఇప్పించండి..!

బాగా చదువుకొని పరీక్షలు రాస్తాం.. ఫలితాలు వచ్చాక కొన్ని రోజులకు డిగ్రీ పట్టా తీసుకొని యూనివర్సిటీల నుంచి బయటపడతాం. కానీ, ఓ వ్యక్తి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినా డిగ్రీ పట్టా కోసం పదిహేడేళ్లుగా నిరీక్షిస్తున్నాడు. ఓపిక నశించి నాకు డిగ్రీ పట్టా ఇప్పించండి మహాప్రభో.. అంటూ

Published : 12 Oct 2020 00:58 IST

మోదీకి లేఖ రాసిన దిల్లీవాసి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాగా చదువుకొని పరీక్షలు రాస్తాం.. ఫలితాలొచ్చాక కొన్ని రోజులకు డిగ్రీ పట్టా తీసుకొని యూనివర్సిటీల నుంచి బయటపడతాం. కానీ, ఓ వ్యక్తి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినా డిగ్రీ పట్టా కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాడు. ఓపిక నశించి నాకు డిగ్రీ పట్టా ఇప్పించండి మహాప్రభో.. అంటూ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల లేఖ రాసిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది.

జాతీయ మీడియా కథనం ప్రకారం.. దిల్లీలోని హైదర్‌పూర్‌కి చెందిన అమిత్‌కుమార్‌ వయసు 40. పదిహేడేళ్ల కిందట ఆగ్రా యూనివర్సిటీకి చెందిన ఓ కళాశాలలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బి.ఎడ్‌) చదివాడు. పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, డిగ్రీ పట్టా ఇవ్వాలంటే రూ. 20వేలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం డిమాండ్‌ చేసిందట. పేదవాడైన అమిత్‌ అంత డబ్బు చెల్లించలేకపోయాడు. ఆ తర్వాత అతడికి వివాహమై, ముగ్గురు సంతానం కలిగారు. స్థానికంగా ఉండే విద్యార్థులకు ట్యూషన్స్‌ చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయినా తన డిగ్రీ పట్టా తెచ్చుకోవడం కోసం కళాశాల, వర్సిటీ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాడు. ఎంత బతిమిలాడినా.. డబ్బులు ఇస్తేగానీ డిగ్రీ పట్టా ఇచ్చేది లేదని యాజమాన్యం తేల్చి చెబుతోందట. దీంతో ఓపిక నశించిన అమిత్‌.. ప్రధాని మోదీకి తన గోడును వివరిస్తూ లేఖ రాశాడు. 

పదిహేడేళ్లుగా తాను బి.ఎడ్‌ డిగ్రీ పట్టా పొందడం కోసం ప్రయత్నిస్తున్నానని, లంచం ఇవ్వలేకపోవడంతో విద్యా సంస్థ యాజమాన్యం తనకు డిగ్రీ ఇవ్వట్లేదని ఆరోపించాడు. లంచం ఇవ్వకుండా డిగ్రీ పట్టా పొందేలా తనకు సాయం చేయాలని ప్రధానిని కోరాడు. పట్టా పొందకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. విద్యా సంస్థ యాజమాన్యం తీరుపై ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశానని అమిత్‌ తెలిపాడు. అయితే వారి నుంచి ఇంకా సమాధానం రాలేదట. రూ.20వేలు లంచం ఇచ్చే స్థోమత తనకు లేదని, అందుకే ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు వివరించాడు.

ఈ ఘటనపై యూనివర్సిటీ ఉపకులపతి స్పందించారు. అమిత్‌కుమార్‌ సమస్య గురించి తనకు తెలుసన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు వెంటనే డిగ్రీ పట్టాలు అందించే విధంగా అంతర్గత వ్యవస్థను నవీకరిస్తున్నామని, త్వరలోనే అమిత్‌కు డిగ్రీ పట్టా వస్తుందని చెప్పారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని