Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 03 Feb 2023 21:01 IST

1. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా?: ఏపీ హైకోర్టు

ఉపాధిహామీ బిల్లుల చెల్లింపు కేసులో ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈకేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్‌.ఎస్‌.రావత్‌ , దినేష్‌ కుమార్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఇందులో ద్వివేది, రావత్‌ 70 కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయస్థానానికి హాజరుకావటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇన్ని కేసులు నమోదవుతున్నాయంటే.. కోర్టు ఉత్తర్వులంటే అంత లెక్కలేని తనం ఎందుకని న్యాయస్థానం నిలదీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌లో రూ.12,800 కోట్లు: అశ్విని వైష్ణవ్‌

బడ్జెట్‌లో రైల్వే విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.12,800 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఇందులో రూ.4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం, రూ.8,406 కోట్లు ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించినట్టు వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. లోకేశ్‌ బహిరంగసభను అడ్డుకున్న పోలీసులు.. బంగారుపాళ్యంలో ఉద్రిక్తత

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం బంగారుపాళ్యం కూడలి వద్దకు చేరుకున్నారు. బంగారుపాళ్యం కూడలిలో బహిరంగసభను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వైపు వందలాది మంది పోలీసులు.. మరో వైపు తెదేపా శ్రేణులు బంగారుపాళ్యం కూడలికి భారీగా చేరుకోవడంతో తోపులాట జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్‌... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల

తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ముందు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ వద్దకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగింది. హుజూరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. పిలిస్తే కదా హాజరయ్యేది అంటూ ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కిచ్చా సుదీప్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

ప్రముఖ కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్‌ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఆయన కాంగ్రెస్‌తో కలిసి నడుస్తారా? కాంగ్రెస్‌ సీనియర్‌ నేతతో సుదీప్‌ కలిసి ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఇప్పుడు ఇదే కర్ణాటక సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌, ఆ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్‌ సుదీప్‌తో సమావేశమైన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విహారీ.. ఏమా షాట్‌..? అది రివర్స్‌ స్వీప్‌ కాదు.. రివర్స్‌ స్లాప్‌: డీకే

హనుమ విహారి.. 2020-21 బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆసీస్‌పై వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన టీమ్‌ఇండియా ఆటగాడు. తాజాగా రంజీ ట్రోఫీలోనూ అతడు చూపించిన తెగువ అభిమానుల ప్రశంసలను అందుకొంది. మణికట్టులో చీలిక కారణంగా ఇబ్బంది పడినప్పటికీ.. జట్టు కోసం బ్యాటింగ్‌కు రావడం విశేషం. ఈ క్రమంలో విహారి ఆడిన ఓ షాట్‌ను టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ అభినందిస్తూ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 2024 ఎన్నికల్లో ఆర్‌వీఎంల వినియోగంపై కేంద్రం క్లారిటీ

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2024 Elections) రిమోట్‌ ఓటింగ్‌ యంత్రాలను (RVM) ఉపయోగించే ఉద్దేశమేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు శుక్రవారం పలువురు ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆర్‌వీఎంలను పరిచయం చేయాలనే ఆలోచన లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. ఆ మందులను రీకాల్‌ చేసిన భారత కంపెనీ

భారత్‌కు చెందిన దగ్గు మందు కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించడం తీవ్ర కలకలం రేపిన వేళ.. మన దేశానికి చెందిన మరో ఔషధంలో నాణ్యతా లోపం బయటపడింది. భారత్‌కు చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తయారు చేసిన ఎజ్రీకేర్‌ కంటి చుక్కల మందు కారణంగా అమెరికా (America)లో పలువురికి కంటిచూపు మందగించడమే గాక.. ఓ మరణం కూడా సంభవించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పతనం అంచున పాక్‌.. 18 రోజులకే విదేశీ మారకపు నిల్వలు!

పొరుగు దేశం పాకిస్థాన్‌(Pakistan) నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు (Forex exchange reserves) భారీగా క్షీణించి 10 ఏళ్ల కనిష్ఠానికి చేరాయి. బుధవారం నాటికి విదేశీ మారకపు నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ తెలిపింది. ఈ నిల్వలు కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బ్యాంకింగ్‌ రంగానికి ఢోకా లేదు.. ‘అదానీ’ వ్యవహారంపై నిర్మలమ్మ స్పందన

అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్ల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ (LIC), ఎస్‌బీఐకి  (SBI) భారీ ఎత్తున పెట్టుబడులు ఉన్నాయని.. నష్టాలకు బాధ్యులెవరంటూ వస్తున్న ఆరోపణలకు ఆమె ప్రధానంగా స్పందించారు. తమ మొత్తం పెట్టుబడుల్లో అదానీ కంపెనీల్లో ఉన్నవి చాలా తక్కువేనని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ చేసిన వ్యాఖ్యల్ని ఆమె ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని