Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Jan 2023 09:12 IST

1. ఏపీలో 5, 9, 10వ తరగతి చదివిన వారూ పట్టభద్రులే!

నారాయణ.. సాహిత్య.. శాంతి ఆశ్రమం.. ఎన్‌కే... నేతాజీ స్ట్రీట్‌.. ఎన్జీవోస్‌ కాలనీ.. నాట్‌ ఎడ్యుకేటెడ్‌... నాట్‌ స్టడీడ్‌.. నథింగ్‌.. రెల్లివీధి.. ఎన్‌ఎన్‌.. వాలంటీర్‌.. సెక్షన్‌ ఏ అండ్‌ బీ..నాట్‌ యాక్యూరేట్‌.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? శాసనమండలి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల విద్యార్హతలు. ఈ కోర్సులు చదివినట్లు దరఖాస్తులో పేర్కొనటమే తరువాయి... వారందర్నీ ఎన్నికల సంఘం పట్టభద్రులుగా గుర్తించేసి ఓటు హక్కు కల్పించేసింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం పనితీరుకు ఈ ఓటర్ల జాబితానే పెద్ద ఉదాహరణ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 84 ఏళ్ల వయసులో ‘పద్మశ్రీ’.. పక్కా ఇల్లు మాత్రం రాలే!

చిన్నవయసులో భర్తను పోగొట్టుకున్న ఆమె.. కుటుంబాన్ని పోషించడం కోసం నిర్మాణరంగంలో కూలీగా మారారు. కళ మీద ప్రేమతో 70 ఏళ్ల వయసులో చిత్రకారిణిగా రూపాంతరం చెందారు. కాన్వాస్‌, కాగితంపై పెయింటింగులు చేసిన తర్వాత.. ఇప్పుడు బంకమట్టి, లోహం, కలప వంటి వాటిపై బైగా తెగకు సంబంధించిన చిత్రాలు వేస్తూ చిత్ర కళాకారిణిగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. అరుదైన కళకు ప్రాణం పోసి ఎనిమిది పదుల వయసులో ఎన్నో పురస్కారాలు అందుకొంటున్నారు. కళారంగంలో తన సేవలకు ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ అవార్డు కూడా వరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్‌’ చూడొద్దు: హైకోర్టు

టీవీ ప్రసారాల్లో అశ్లీలతపై అభ్యంతరం ఉన్నవాళ్లు నేరుగా హైకోర్టును ఆశ్రయించకుండా ప్రత్యామ్నాయ మార్గం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆ వివరాలను కౌంటర్‌ రూపంలో కోర్టు ముందుంచాలని స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాటీవీ ఎండీని హైకోర్టు ఆదేశించింది. ఎవరు ఏమి మాట్లాడాలో చెప్పేపని కోర్టులది కాదని పేర్కొంది. బిగ్‌బాస్‌ షో కంటే మించిన అశ్లీలత ఉండే కంటెంట్‌ వివిధ వేదికల ద్వారా అందుబాటులో ఉందంది. రియాల్టీ షోపై అభ్యంతరం ఉంటే చూడొద్దని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరిన్ని అప్పుల కోసం అన్వేషణ!

రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్పుల కోసం అన్వేషిస్తోంది. వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే వేలంలో పాల్గొని రూ. 1,557 కోట్ల రుణం తీసుకోనుంది. రూ.వెయ్యి కోట్లు 13 ఏళ్ల కాలపరిమితితో, మరో రూ. 557 కోట్లు 9 ఏళ్ల కాలపరిమితితో తీర్చేలా తీసుకోబోతోంది. కేంద్రం జనవరి మొదటి వారంలో ఇచ్చిన బహిరంగ మార్కెట్‌ రుణాల మొత్తం అనుమతి దీంతో సంపూర్ణమవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో రూ. 4,557 కోట్ల రుణం మాత్రమే తీసుకునేందుకు వెసులుబాటు ఉందని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దిల్లీ పిలుపు కోసమా! 

ముఖ్యమంత్రి జగన్‌ గత నెలాఖరులో దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలిసి వచ్చారు. ఇప్పుడు మళ్లీ దిల్లీకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. నేడో రేపో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అపాయింట్‌ ఖరారవ్వచ్చన్న సమాచారం ఉన్న నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌, పొన్నూరు, శనివారం విశాఖ వెళ్లాల్సి ఉన్నా ఆగిపోయారని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏడు బిల్లుల ఎదురుచూపు!

శాసనసభ మరోసారి సమావేశాలకు సిద్ధమవుతుండగా గతంలో సభలో ఆమోదించిన ఏడు బిల్లులు గవర్నర్‌ సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 13న ఉభయ సభలు ఆమోదించిన ఎనిమిది బిల్లుల్లో ఒక్క దానికి మాత్రమే రాజ్‌భవన్‌ ఆమోదముద్ర వేయడంతో మిగతావి చట్ట రూపం దాల్చలేదు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు బిల్లుపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ బిల్లు కూడా గవర్నర్‌ కార్యాలయం పరిశీలనలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇంటిపై బడ్జెట్‌ కరుణించేనా?

కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా గృహ నిర్మాణ రంగానికి తగిన రాయితీలు, ప్రోత్సాహకాలు దక్కేనా? గత కొన్నేళ్లుగా బడ్జెట్‌ సమయానికి పరిశ్రమ వర్గాలు, కొనుగోలుదారులు భారీగా ఆశలు పెట్టుకోవడం.. బడ్జెట్‌ చూశాక నిట్టూర్చడం పరిపాటైంది. నిర్మాణ వ్యయం పెరిగి సామాన్య, మధ్యతరగతి వాసులకు ఇళ్ల ధరలు అందుబాటులో లేకుండా పోయిన తరుణంలో రియల్‌ ఎస్టేట్‌ జాతీయ, తెలంగాణ సంఘాలు విత్త మంత్రికి ఇప్పటికే పలు విజ్ఞప్తులు చేశాయి. కొందరు బిల్డర్లు ప్రధానికి లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బస్సుల్లేక.. ప్రయాణాలు సాగక

భూపాలపల్లి నుంచి ములుగుకు కేవలం 36 కి.మీ దూరమే.. అయినా బస్సుల్లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండు జిల్లాలు ఏర్పడిన తర్వాతా పరిస్థితి మారలేదు. నిత్యం భూపాలపల్లి డిపోకు ములుగు, ఏటూరునాగరానికి వెళ్లే ప్రయాణికులు వందల సంఖ్యలో వస్తుంటారు. భూపాలపల్లి డిపో నుంచి ములుగుకు ఒకే ఒక్క బస్సు మాత్రమే ఉంది. దీంతో నిరీక్షణ తప్పడం లేదు. మణుగూరు డిపో నుంచి ఏటూరునాగరం మీదుగా భూపాలపల్లికి నడిచే మూడు బస్సు సర్వీసులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కేటీఆర్‌ సారూ.. ఇదండీ పురపాలికల తీరు

‘‘పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దాదాపు మూడున్నరేళ్ల తర్వాత నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. గతేడాది సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఆయన వచ్చినా.. అక్కడి నుంచి అటే వెళ్లిపోయారు. మంత్రి హోదాలో ఆయన జిల్లాకు రావటం ఇది రెండోసారి. 2019 ఆగస్టులో ఐటీహబ్‌ భవనానికి భూమిపూజ చేశారు.’’ జిల్లాకేంద్రంలో నగర పాలకసంస్థకు సంబంధించి..పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పనుల పర్యవేక్షణలో ఇబ్బందులెదురవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దివ్వరూపం.. నిత్య తేజం..!

ఆరోగ్యం భాస్కరాధిత్యాత్‌ అంటారు.. అంటే సమస్త జీవకోటి ఆరోగ్యం సూర్యుని ఆధీనంలో ఉంటుందని అర్థం. నిత్యం భానుడిని కొలిచేవారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఏటా మాఘమాసంలో అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుక నిర్వహిస్తారు. ముందురోజు అర్ధరాత్రి నుంచి సాయంత్రం వరకు ఆలయంలోని ఉషాపద్మినీఛాయా సమేతుడైన సూర్యభగవానుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో అరసవల్లి క్షేత్రం, ఆదిత్యుడి వైభవం, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని