కొవిడ్‌ టెస్టులు అమెరికా, భారత్‌లోనే ఎక్కువ!

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తోన్న దేశాల్లో అమెరికా, భారత్‌లు ముందున్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టంచేశారు.

Published : 11 Aug 2020 15:37 IST

మరోసారి స్పష్టంచేసిన డొనాల్డ్‌ ట్రంప్‌
అమెరికాలో 6.5కోట్ల మందికి, భారత్‌లో 2.5కోట్ల టెస్టులు

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తోన్న దేశాల్లో అమెరికా, భారత్‌లు ముందున్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టంచేశారు. ఇప్పటికే అమెరికాలో 6కోట్ల 50లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఈ విషయంలో అమెరికాకు దగ్గరలో ఏ దేశం కూడా లేదని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడిన ట్రంప్‌, వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

గత కొద్దిరోజులుగా అమెరికాలో వైరస్‌ తీవ్రత తగ్గిందని, గడిచిన వారంరోజుల్లో దాదాపు 14శాతం తగ్గుదల కనిపించిందని ట్రంప్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వైరస్‌ తీవ్రత తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఆసుపత్రుల్లో నమోదవుతున్న వారిసంఖ్య 7శాతం తగ్గగా, మరణాల సంఖ్య 9శాతం క్షీణించడం చూస్తుంటే ఇది స్పష్టమవుతోందన్నారు. ఇదిలాఉంటే, అమెరికాలో ఇప్పటివరకు 50లక్షల మందిలో వైరస్‌ బయటపడగా వీరిలో లక్షా 63వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత్‌లో నిత్యం 7లక్షల పరీక్షలు..

వైరస్‌ తీవ్రత పెరుగుతున్న సమయంలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య భారీగా చేయడం అనివార్యమయ్యింది. దీంతో నిత్యం దేశంలో ఐదు నుంచి ఏడు లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 6లక్షల 98వేల (6,98,290) శాంపిళ్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో 2కోట్ల 52లక్షల శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.

ఇవీ చదవండి..
భారత్‌లో 45వేలు దాటిన కరోనా మరణాలు!
పుక్కిలిస్తే తగ్గుతున్న కరోనా వైరస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని