HIV Blood: దిగ్భ్రాంతికర ఘటన.. 8 నెలల పసికందుకు హెచ్‌ఐవీ రక్తం!

ఓ రక్తనిధి నిర్వాహకులు నిర్లక్ష్యంతో చేసిన తీవ్ర తప్పిదం 8 నెలల పసికందు పాలిట శాపంగా మారింది. హెచ్‌ఐవీ ఉన్న రక్తం ఎక్కించడంతో అభం శుభం తెలియని ఆ చిన్నారికి ప్రాణాపాయం ఏర్పడింది. ఈ దిగ్భ్రాంతికర సంఘటన మహారాష్ట్రలోని ...

Updated : 03 Sep 2021 07:37 IST

దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

ముంబయి: ఓ రక్తనిధి నిర్వాహకులు నిర్లక్ష్యంతో చేసిన తీవ్ర తప్పిదం 8 నెలల పసికందు పాలిట శాపంగా మారింది. హెచ్‌ఐవీ ఉన్న రక్తం ఎక్కించడంతో అభం శుభం తెలియని ఆ చిన్నారికి ప్రాణాపాయం ఏర్పడింది. ఈ దిగ్భ్రాంతికర సంఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. చిన్నారికి రెండు నెలల క్రితం తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో వైద్యుడి సూచన మేరకు అకోలాలోని ఓ రక్త నిధి నుంచి రక్తాన్ని ఎక్కించారు. ఆ తర్వాత చిన్నారి కోలుకున్నా మళ్లీ కొన్నాళ్లుగా తరచూ అనారోగ్యం బారిన పడేది. దీంతో చిన్నారిని అమరావతిలోని ఓ ఆసుపత్రిలో చూపించారు. పాపకు వేరే అనారోగ్య లక్షణాలు లేకపోవడంతో అనుమానించిన వైద్యులు హెచ్‌ఐవీ పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చింది. ఆ పాప తల్లిదండ్రులకూ హెచ్‌ఐవీ పరీక్ష చేయగా నెగటివ్‌ వచ్చింది. దీంతో వైద్యులు వారిని ఆరా తీయగా రక్తం ఎక్కించిన విషయాన్ని వెల్లడించారు. ప్రతి రక్తనిధిలోనూ దాతల నుంచి రక్తాన్ని స్వీకరించేముందు హెచ్‌ఐవీ సహా అన్నిరకాల పరీక్షలు చేయాలని నిబంధనలు ఉన్నాయని, అయినా పాపకు రక్తనిధి నుంచి హెచ్‌ఐవీ రక్తం ఎలా ఎక్కించారన్నది తెలియాల్సి ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. దీనిపై 3 రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ తోపే వైద్యాధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని