పార్టీ కార్యకర్తతో మహిళా ఎమ్మెల్యే పెళ్లి

పార్టీ కార్యకర్తను ఓ మహిళా ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్నారు. పటియాలాలో రోరేవాల్‌ గ్రామంలోని ఓ గురుద్వారాలో శుక్రవారం జరిగిన వీరి వివాహానికి పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ హాజరయ్యారు.

Updated : 08 Oct 2022 09:13 IST

పంజాబ్‌కు చెందిన ఆప్‌ శాసన సభ్యురాలు నరిందర్‌ కౌర్‌ భరాజ్‌(28) ఆ పార్టీ కార్యకర్త మణ్‌దీప్‌ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. పటియాలాలో రోరేవాల్‌ గ్రామంలోని ఓ గురుద్వారాలో శుక్రవారం జరిగిన వీరి వివాహానికి పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ హాజరయ్యారు. సంగ్రూర్‌లోని భరాజ్‌ గ్రామంలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన నరిందర్‌ కౌర్‌ పటియాలాలోని పంజాబ్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తన గ్రామంలో ఒంటరిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ బూత్‌ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. భగవంత్‌ మాన్‌ ప్రోత్సాహంతో రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో సంగ్రూర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. నరిందర్‌ కౌర్‌.. పంజాబ్‌లో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. మణ్‌దీప్‌ సింగ్‌ గతంలో సంగ్రూర్‌ జిల్లా ఆప్‌ మీడియా ఇంఛార్జ్‌గా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని