‘సుప్రీం’ విజయం.. ఆ 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌

భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కనుంది. ఈ హోదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు

Published : 22 Oct 2021 15:40 IST

దిల్లీ: భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కనుంది. ఈ హోదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వారికి శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు కోర్టుకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

సైన్యంలో 14ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 17న తీర్పువెలువరించింది. దీంతో సైన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసి 400 మందికి పైగా మహిళా అధికారులకు ఈ హోదా కల్పించింది. మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్‌) సమీక్షను ఆధారంగా చేసుకుని కొందరికి ఈ హోదా ఇచ్చింది. దీంతో శాశ్వత కమిషన్‌ తిరస్కరణకు గురైన 71 మంది అధికారిణులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్‌లో చేర్చే విధానం ఏకపక్షం, అన్యాయంగా ఉందని ఆరోపిస్తూ పలు అంశాలను తమ పిటిషన్లో పేర్కొన్నారు. 

దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏసీఆర్‌ విధానాన్ని అనుసరించడం వివక్షపూరితమే అని అభిప్రాయపడింది. దీనిపై కేంద్రం స్పందన అడిగిన న్యాయస్థానం.. అప్పటిదాకా ఈ 71 మంది మహిళా అధికారులను సర్వీసు నుంచి తొలగించొద్దని ఆదేశించింది. దీంతో కేంద్రం నేడు తమ స్పందన తెలియజేసింది. ఈ 71 మందిలో 39 మంది మహిళా అధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులుగా గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. మరో ఏడుగురు వైద్యపరంగా ఫిట్‌గా లేరని, ఇక మిగతా 25 మందిపై తీవ్రమైన క్రమశిక్షణారాహిత్య అభియోగాలున్నాయని పేర్కొంది. కేంద్రం నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆ 39 మందికి వారం పని దినాల్లో శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని ఆదేశించింది. అంతేగాక, మిగతా 25 మంది శాశ్వత కమిషన్‌ను ఎందుకు అనర్హులో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని