Jalandhar: 70 అడుగుల గొయ్యి.. 45 గంటల శ్రమ.. కార్మికుడి కథ విషాదాంతం
పంజాబ్లో 70 అడుగుల లోతైన గొయ్యిలో పడిపోయిన కార్మికుడు మృతి చెందారు. దాదాపు 45 గంటల సహాయక చర్యల అనంతరం ఆయన మృతదేహం వెలికితీశారు.
చండీగఢ్: పంజాబ్లో ఓ లోతైన గొయ్యిలో చిక్కుకుపోయిన కార్మికుడి (Man stuck in Pit) కథ విషాదాంతమైంది. దాదాపు రెండు రోజులపాటు ఆయన్ను కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సహాయక చర్యల క్రమంలో సోమవారం 4 గంటల సమయంలో ఆయన మృతదేహం లభ్యమైంది. స్థానికంగా ఓ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా తవ్విన గొయ్యిలో శనివారం సాయంత్రం ఆయన చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
ఇక్కడి జలంధర్ జిల్లా బస్రంపుర్ సమీపంలో.. దిల్లీ నుంచి జమ్మూలోని కటడా వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా భారీ పిల్లర్ ఏర్పాటు చేసేందుకు ఓ గొయ్యి తవ్వారు. లోపల బోరింగ్ యంత్రంలో సమస్య తలెత్తడంతో ఇద్దరు కార్మికులు అందులోకి దిగారు. పై నుంచి ఇసుక పడటం గమనించి పవన్ అనే కార్మికుడు పైకి చేరుకోగా.. హరియాణాకు చెందిన సురేశ్ (55) మాత్రం 70 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు.
‘హై రిస్క్’లో ఆండ్రాయిడ్ యూజర్లు.. కేంద్రం హెచ్చరిక
ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆదివారం అంతా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గొయ్యి చుట్టూ ఉన్న మెత్తటి మట్టి కిందపడుతుండటం, తవ్వకాలు జరుపుతోన్న ప్రదేశానికి సమీపంలోనే ఓ చెరువు ఉండటం సహాయక చర్యలకు సవాల్గా మారినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే దాదాపు 45 గంటల ఆపరేషన్ తర్వాత గొయ్యిలో చిక్కుకున్న వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.