Android Users: ‘హై రిస్క్‌’లో ఆండ్రాయిడ్‌ యూజర్లు.. కేంద్రం హెచ్చరిక

ఆండ్రాయిడ్‌ (Android)లోని కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని CERT-In వెల్లడించింది. ఇవి అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది.

Updated : 14 Aug 2023 19:53 IST

దిల్లీ: ఆండ్రాయిడ్‌ (Android) ఫోన్లను వినియోగిస్తున్న వారికి కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాల (vulnerabilities)ను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ లోపాలను ‘అత్యంత తీవ్రమైనవి’గా పేర్కొన్న CERT-In.. వీటితో సైబర్‌ నేరగాళ్లు (Cyber Attack) ఫోన్లలో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశముందని హెచ్చరించింది.

ఆండ్రాయిడ్‌ (Android) 10, 11, 12, 12ఎల్‌, 13 వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు CERT-In తమ ప్రకటనలో వెల్లడించింది. ఫ్రేమ్‌వర్క్‌, ఆండ్రాయిడ్‌ రన్‌టైమ్‌, సిస్టమ్‌ కాంపోనెంట్‌, గూగుల్‌ ప్లే సిస్టమ్‌ అప్‌డేట్స్‌, కెర్నెల్‌, ఆర్మ్‌ కాంపోనెంట్స్‌, క్వాల్కమ్‌ క్లోజ్డ్‌ సోర్స్‌ కాంపోనెంట్స్‌లో తప్పిదాల కారణంగా ఈ సమస్యలు వచ్చినట్లు తెలిపింది.

బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోకపోతే ఇబ్బందే.. క్రోమ్‌ యూజర్లకు కేంద్రం సూచన

ప్రమాదం ఇలా..

వీటిని ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు మన మొబైల్‌ ఫోన్లలో పాస్‌వర్డ్‌లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీల డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలించే అవకాశముందని CERT-In హెచ్చరించింది. హ్యాకర్లు ఫోన్లపై దాడి చేసినప్పుడు..  మొబైల్‌ను వారి అధీనంలోకి తీసుకుని ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను జొప్పించడం, డివైజ్‌ను పనికిరాకుండా చేసేందుకు ఈ లోపాలు ఉపయోగపడుతాయని పేర్కొంది.

యూజర్లు ఏం చేయాలి..?

ఈ లోపాల నుంచి ఫోన్లను సురక్షితంగా ఉంచుకునేందుకు యూజర్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని CERT-In సూచించింది. ఇందుకోసం డివైజ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి System అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత System updatesపై క్లిక్‌ చేసి.. ఏదైనా అప్‌డేట్‌ ఉంటే దాన్ని సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇచ్చిన సూచనలు పాటిస్తూ దాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలని CERT-In తెలిపింది. దీంతో పాటు యూజర్లకు పలు సూచనలు చేసింది. 

  • విశ్వసనీయమైన సోర్సుల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  • ఫోన్‌లో మాల్వేర్‌ ఉందా?లేదా? అని తెలుసుకునేందుకు సెక్యూరిటీ యాప్‌ను వినియోగించాలి.
  • విశ్వసనీయమైన వ్యక్తులు/సంస్థలు పంపిన ఈమెయిళ్లు, అటాచ్‌మెంట్లను మాత్రమే తెరవాలి.
  • బలమైన పాస్‌వర్డ్‌తో పాటు యాప్స్‌లో టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఉపయోగించాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు