కరోనా: ఇక భారత్‌లో ‘టెలీమెడిసిన్‌’ వైద్యసేవలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ‘టెలీమెడిసిన్‌’ విధానంలో వైద్యసేవలు అందించటానికి మెడికల్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఇండియా మార్గదర్శకాలు జారీచేసింది.

Updated : 26 Mar 2020 13:51 IST

మార్గదర్శకాలు జారీచేసిన మెడికల్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఇండియా

దిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశంలో ‘టెలీమెడిసిన్‌’ విధానంలో వైద్యసేవలు అందించటానికి ‘మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ విధానంలో వీడియో సమావేశం, ఫోన్‌ సంభాషణ లేదా మెసేజ్‌ల ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలను అందించే అవకాశం కలుగుతుంది. భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనావైరస్‌పై పోరుకు టెలీమెడిసిన్‌ అద్భుతంగా సాయం చేయనుంది. చైనాలో కూడా ఆసుపత్రులు కిక్కిరిసన సమయంలో  ఈ విధానంలో వైద్యం చేశారు.  

టెలీమెడిసిన్‌ అంటే...

ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా దూరంగా ఉన్న రోగులకు చికిత్సను అందించే వైద్యవిధానాన్ని టెలీమెడిసిన్‌ అంటారు. తద్వారా రోగుల వల్ల వైద్య సిబ్బందికి, ఇతరులకు కూడా అంటువ్యాధి సోకే ప్రమాదాన్ని నివారించవచ్చు. అంతే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన ఎక్కువ మందికి వైద్యం అందటానికి కూడా వీలవుతుంది. పరిమిత సంఖ్యలో వైద్యసిబ్బందితో ఎక్కవ మందిని కాపాడవచ్చు. 

ఇప్పుడు ఎందుకు?

ఇక కొవిడ్‌-19 వ్యాప్తి అరికట్టేందుకు దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆస్పత్రులకు వెళ్లటం కూడా కష్టసాధ్యంగా పరిణమించింది. ఇక మారుమూల ప్రాంతాలకు వైద్యసహాయాన్ని అందించటం మరింత సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ‘టెలీమెడిసిన్‌’ విధానంలో సేవలు అందించటానికి మెడికల్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఇండియా (ఎంసీఐ), నీతి ఆయోగ్‌తో చర్చల అనంతరం మార్గదర్శకాలను రూపొందించింది. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించాలో వైద్యులు, వైద్యసిబ్బందికి స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. ఈ అదేశాల ప్రకారం...

టెలీమెడిసిన్‌ వైద్యసేవలు అందించేందుకు రిజిస్టర్ చేసుకున్న వైద్యులు మాత్రమే అర్హులు.

రోగికి సాంకేతిక సేవలు సరిపోతాయా లేదా నేరుగా వైద్య సేవలు అందించాలా అనేది కూడా ఈ విధానంలో వైద్యులే నిర్ణయిస్తారు.

ఈ విధానంలో వైద్యుడు, రోగికి సంబంధించిన వివరాలు పరస్పరం తెలియాలి. 

టెలీమెడిసిన్‌ విధానంలో వీడియో, ఆడియో, ఫోన్‌ మెసేజ్‌ల రూపంలో కూడా సేవలు అందించవచ్చు. 

ఔషధాలను సూచించేందుకు ప్రిస్క్రిప్షన్‌ ఇవ్వాలంటే రోగి తన వయస్సును కచ్చితంగా తెలియచేయాలి. అవపరమైతే వయస్సు నిర్ధారణకు ఆధారాన్ని కూడా చూపాల్సి ఉంటుంది. 

అంతేకాకుండా మొబైల్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు వంటి టెక్నాలజీ ప్లాట్ ఫాంల ఏర్పాటుకు కూడా నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సూచనలు జారీచేసింది. వినియోగదారులకు తాము స్వయంగా వైద్య సలహాలు అందించరాదని.. ప్రభుత్వ అనుమతి పొందిన వైద్యులు ద్వారా మాత్రమే వైద్య సలహాలు అందించాలని అన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలకు నిర్దేశించింది. 

‘‘విపత్తులు, మహమ్మారులు విజృంభిస్తున్నపుడు వైద్యసేవలు అందజేయడం సవాలుగా మారుతుంది. టెలీమెడిసిన్ విధానం అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కానప్పటికీ... రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు రావటానికి వైద్యులకు చక్కగా ఉపకరిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న పరిస్థితుల్లో వైద్య సిబ్బంది వైరస్‌లు, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఈ విధానం ఉపమోగకరం. వైద్యం సులువుగా, అధిక ప్రజలకు అందించటానికి ఈ విధానం అత్యవసరం’’ అని ఎంసీఐ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని