‘5జీ’తో సైబర్‌ నేరాల ముప్పు!

దేశంలో 5జీతో వేగవంతమైన నెట్‌వర్క్‌ ఆధారిత సేవల్లో వేగం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతుంటే.. మరోవైపు స్మగ్లర్లు, ఆర్థికపరమైన నేరగాళ్లు, ఉగ్రవాద సంస్థలకు ఇది వేదికగా మారే అవకాశం ఉందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Published : 25 Jan 2023 06:05 IST

ఐపీఎస్‌ అధికారుల నివేదికలో ఆందోళన
తగిన చర్యలు తీసుకోవాలంటూ సూచన

దిల్లీ: దేశంలో 5జీతో వేగవంతమైన నెట్‌వర్క్‌ ఆధారిత సేవల్లో వేగం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతుంటే.. మరోవైపు స్మగ్లర్లు, ఆర్థికపరమైన నేరగాళ్లు, ఉగ్రవాద సంస్థలకు ఇది వేదికగా మారే అవకాశం ఉందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు పలువురు ఐపీఎస్‌ అధికారులు దిల్లీలో జరుగుతున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీపీల సమావేశంలో 5జీ నెట్‌వర్క్‌పై ఒక నివేదికను సమర్పించారు. అందులో పేర్కొన్న ఆందోళన అంశాలు, తీసుకోవలసిన జాగ్రత్తలివీ..  

* 5జీ నెట్‌వర్క్‌ సాయంతో హెచ్‌టీటీపీ, ట్రాన్స్‌పోర్ట్‌ లేయర్‌ సెక్యూరిటీ వంటి ఇంటర్నెట్‌ ప్రోటోకాల్స్‌ను సైబర్‌ నేరగాళ్లు సులభంగా యాక్సెస్‌ చేసి వాటి సాంకేతిక వ్యవస్థల్లోకి మాల్‌వేర్‌ను పంపి సైబర్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉంది.

* క్రిప్టో కరెన్సీ లేదా బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో 5జీ నెట్‌వర్క్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పలు సందర్భాల్లో సైబర్‌ నేరాలు జరిగిన తీరును గుర్తించడం సంక్లిష్టంగా మారుతుంది.

* మాదక ద్రవ్యాల సరఫరా, అక్రమ మానవ రవాణా, మనీలాండరింగ్‌, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం వంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ మధ్య సమాచార మార్పిడికి 5జీ నెట్‌వర్క్‌లోని భద్రత వ్యవస్థను వేదికగా మార్చుకునే అవకాశం ఉంది.

* 5జీ నెట్‌వర్క్‌లోని నెట్‌వర్క్‌ ఫంక్షన్‌ వర్చువలైజేషన్‌ కారణంగా సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత వివరాల్లో ఫోన్‌ నంబర్లను మార్చి.. యూజర్ల బ్యాంకింగ్‌తోపాటు మొబైల్‌ ఆధారిత సేవలను తమ ఆధీనంలోకి తీసుకోగలరు.

* 5జీ నెట్‌వర్క్‌ ఎన్నో రకాల ఏఐ ఆధారిత ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను సపోర్ట్‌ చేస్తుండటంతో మొబైల్‌ నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌, సేవల్లో అంతరాయం కలిగించడం, బ్యాటరీ ఛార్జింగ్‌ తగ్గించడం, సేవలను నెమ్మదింపజేయడం, మాల్‌వేర్‌ ప్రవేశపెట్టడం, సీఎన్‌సీ క్రియేషన్‌, డీఎన్‌ఎస్‌ స్పూఫింగ్‌ వంటి వాటిని సైబర్‌ నేరగాళ్లు సులభంగా చేయగలరు.

* 5జీ నెట్‌వర్క్‌ సంస్థలు యూజర్ల విలువైన సమాచారాన్ని అడ్వర్‌టైజ్‌మెంట్‌ సంస్థలకు అమ్మే సందర్భంలో అవి సంఘవిద్రోహులకు చేరే అవకాశం ఉంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు

* వినియోగదారులకు అందుతున్న సేవలకు పూర్తిస్థాయిలో సైబర్‌ భద్రతను అందించడం ఎంతో కీలకం.

* ఐవోటీ భద్రత గురించి ఎప్పటికప్పుడు యూజర్లకు అవగాహన కల్పించాలి.

* 5జీ నెట్‌వర్క్‌ ఆపరేటర్లు హైబ్రిడ్‌ క్లౌడ్‌ విధానాన్ని అనుసరించి.. సున్నితమైన డేటాను లోకల్‌ సర్వర్లలో, సాధారణ డేటాను క్లౌడ్‌లో భద్రపరచాలి.

* మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలు నెట్‌వర్క్‌ సరఫరా కోసం ఉపయోగించే విడిభాగాలను నమ్మకమైన సంస్థల నుంచే కొనుగోలు చేయాలి. (దాని వల్ల చైనా వంటి దేశాలకు భారత్‌లోని ప్రభుత్వ వ్యవస్థల్లోని విలువైన సమాచారాన్ని సేకరించడం కష్టంగా మారుతుంది)

* దేశీయంగా 5జీ నెట్‌వర్క్‌ సేవలు గతేడాది చివర్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని