జడ్జీలపై దుష్ప్రచారం కోర్టు ధిక్కరణే

సామాజిక మాధ్యమాల ద్వారా జడ్జీలపై అపనిందలు మోపడం, వారి వ్యక్తిత్వానికి కళంకం ఆపాదించేలా దుష్ప్రచారాలు చేయడం తగదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Published : 31 May 2023 02:57 IST

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: సామాజిక మాధ్యమాల ద్వారా జడ్జీలపై అపనిందలు మోపడం, వారి వ్యక్తిత్వానికి కళంకం ఆపాదించేలా దుష్ప్రచారాలు చేయడం తగదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జిల్లా జడ్జీపై అవినీతి ఆరోపణలు చేసిన కేసులో మధ్యప్రదేశ్‌ హైకోర్టు విధించిన 10 రోజుల జైలు శిక్షను రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్‌ బేలా   ఎం త్రివేది, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. ‘మీకు అనుకూలమైన ఉత్తర్వులివ్వలేదని జడ్జీని కించపరచడం తగదు. కార్యనిర్వాహక వర్గం నుంచే కాదు బాహ్యశక్తుల ఒత్తిళ్లకూ లొంగిపోకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పని చేయాల్సి ఉంటుంది. జడ్జీలపై నిందలు మోపాలంటే ఎవరైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇతరులకూ ఈ కేసు గుణపాఠం కావాలి’ అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌పై దయ చూపాలన్న నిందితుడి తరఫు న్యాయవాది అభ్యర్థననూ ధర్మాసనం తోసిపుచ్చింది. ‘న్యాయం చెప్పడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఇటువంటి వ్యక్తులను కనికరించడానికి కాదు’ అని స్పష్టం చేసింది. కృష్ణకుమార్‌ రఘువంశీ అనే వ్యక్తి జిల్లా జడ్జీపై అవినీతి ఆరోపణలు చేయడంతో మధ్యప్రదేశ్‌ హైకోర్టు అతనిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రఘువంశీ.. ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేయగా తిరస్కరణకు గురైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని