Black Fungus: ఆరోగ్య మంత్రి సూచనలివే..

బ్లాక్‌ ఫంగస్‌ లేదా మ్యుకర్‌మైకోసిస్..కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వెలుగుచూస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు కలవరం పుట్టిస్తోంది.

Published : 14 May 2021 17:40 IST

అవగాహనతో అరికట్టొచ్చన్న ఆరోగ్య శాఖ

దిల్లీ: బ్లాక్‌ ఫంగస్‌ లేదా మ్యుకర్‌మైకోసిస్..కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వెలుగుచూస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు కలవరం పుట్టిస్తోంది. కొవిడ్ చికిత్సలో భాగంగా రోగనిరోధక శక్తిని తాత్కాలికంగా అణిచిపెట్టేందుకు ఇచ్చే స్టిరాయిడ్ల మోతాదు మించి వాడిన వారిలో, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇదో ముప్పుగా పరిణమించింది. ప్రజలు దానిని ముందుగా గుర్తించి, అప్రమత్తంగా ఉండే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య శాఖ ట్విటర్‌లో పలు సూచనలు చేసింది. 

‘మ్యుకర్‌మైకోసిస్‌ను బ్లాక్‌ఫంగస్‌గా కూడా పిలుస్తారు. ఇటీవలి కాలంలో దీన్ని కొంతమంది కొవిడ్ రోగుల్లో గుర్తించాం. అవగాహన, ప్రారంభంలోనే రోగ నిర్ధారణ ఈ బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తిని అరికట్టడానికి దోహదం చేస్తాయి’ అంటూ ఆ వ్యాధి లక్షణాలను ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. 

మ్యుకర్‌మైకోసిస్ ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఇది పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడినవారిలో ఈ వ్యాధి బయటపడుతోంది. తాజాగా కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిలో కూడా ఇది వెలుగుచూస్తోంది. కరోనా మొదటి దశలో చికిత్సలో స్టిరాయిడ్స్ వాడకం పెద్దగా లేనందున బ్లాక్‌ ఫంగస్‌ కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు.

లక్షణాలివే..

కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి వెల్లడించారు. అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు వెల్లడించారు.

కొవిడ్‌ వేళ.. బ్లాక్‌ఫంగస్‌ కేసులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. తమ దగ్గర ఇప్పటివరకు రెండువేలకు పైగా కేసులు ఉండొచ్చని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే అన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాటి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ కేసుల విషయంలో ఒక అంచనాకు వచ్చేందుకు ప్రత్యేక డేటా బేస్‌ను ఏర్పాటుచేసేలా మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధి లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. తొలి దశలోనే లక్షణాలు గుర్తించి చికిత్స అందిస్తే, ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని వారంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని