Nirmala Sitharaman: ‘హార్స్‌ ట్రేడింగ్‌’పై జీఎస్‌టీ.. నిర్మలమ్మ పొరబాటు..

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న చండీగఢ్‌లో వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా గుర్రపు పందేల గురించి మాట్లాడుతూ.. ఆమె పొరబాటుగా

Published : 01 Jul 2022 01:46 IST

వీడియో వైరల్‌.. విపక్షాల వ్యంగ్యాస్త్రాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న చండీగఢ్‌లో వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా గుర్రపు పందేల గురించి మాట్లాడుతూ.. ఆమె పొరబాటుగా ‘హార్స్‌ ట్రేడింగ్‌’ అని అన్నారు. ఇది కాస్తా ప్రతిపక్షాల దృష్టిలో పడటంతో ఆర్థిక మంత్రి, భాజపాపై విపక్ష నేతలు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.

చండీగఢ్‌ వేదికగా రెండు రోజలు పాటు జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశం బుధవారం ముగిసింది. ఈ భేటీ అనంతరం నిర్మలా సీతారామన్‌ విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. క్యాసినోలు, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లపై జీఎస్‌టీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. ఈ విషయం గురించి నిర్మలమ్మ మాట్లాడుతూ.. ‘హార్స్‌ రేసింగ్‌’ అనే పదానికి బదులుగా ‘హార్స్‌ ట్రేడింగ్‌’ అని అన్నారు. తన పొరబాటును కేంద్ర మంత్రి వెంటనే గ్రహించి సరిదిద్దుకున్నారు కూడా.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకేముంది.. ప్రతిపక్ష నేతలు ఈ వీడియోను తమ సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. ‘‘నిర్మలాజీకి విస్తృత పరిధిలో ఆలోచించే సామర్థ్యం ఉందని నాకు తెలుసు. అవును.. హార్స్‌ ట్రేడింగ్‌పై తప్పకుండా జీఎస్‌టీ విధించాలి’’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేరా విమర్శలు గుప్పించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ కూడా దీనిపై స్పందిస్తూ.. ‘‘నిజం బయటపడిందా? హార్స్‌ ట్రేడింగ్‌పై జీఎస్‌టీ. అలానే కానివ్వండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

సాధారణంగా రాజకీయాల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడాన్ని ‘హార్స్‌ ట్రేడింగ్‌’గా అభివర్ణిస్తారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. భాజపా హార్స్‌ ట్రేడింగ్‌ కారణంగానే జరిగిందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారంటూ స్వయంగా శివసేననే ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్‌ నోటి నుంచి ‘హార్స్‌ ట్రేడింగ్‌’ అనే పదం రావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని