Maldives: దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి

Maldives: భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించనున్నారు.

Published : 08 May 2024 09:05 IST

దిల్లీ: మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ భారత పర్యటనకు రానున్నారు. మే 9న ఆయన దిల్లీలో మన విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశం నుంచి భారత్‌కు తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం గమనార్హం.

మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని ముయిజ్జు కోరిన విషయం తెలిసిందే. అందుకు ఆయన మే 10 గడువుగా విధించారు. అది సమీపించిన తరుణంలో ఇరు దేశాల మధ్య సమావేశం జరుగుతుండడం గమనార్హం. అక్కడున్న సైనికుల్లో చాలా మందిని భారత్‌ ఇప్పటికే వెనక్కి రప్పించింది. గురువారం నాటి భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ప్రాంతీయపరమైన అంశాలను చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి మాల్దీవులు కీలక భాగస్వామి. జమీర్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు