‘మరోసారి ఆ తప్పు జరగదు’

2012లో నోబెల్‌ శాంతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన ఘటనకు బాధ్యుడైన ఉగ్రవాది ఇషానుల్లా ఎహ్సాన్‌ మరోసారి మలాలాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఇంతకు ముందు జరిగిన తప్పు మరోసారి జరగదంటూ మలాలాను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు.

Updated : 26 Oct 2022 14:47 IST

మలాలాకు తాలిబన్ల బెదిరింపులు

లండన్‌: 2012లో నోబెల్‌ శాంతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన ఘటనకు బాధ్యుడైన ఉగ్రవాది ఇషానుల్లా ఎహ్సాన్‌ మరోసారి మలాలాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఇంతకు ముందు జరిగిన తప్పు మరోసారి జరగదంటూ మలాలాను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు. అనంతరం ఆ ఖాతాను ట్విటర్‌ తొలగించింది. అనంతరం తనపై కాల్పులు జరిపిన కేసులో కీలక వ్యక్తి జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడంటూ..మలాలా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, పాకిస్థాన్‌ సైన్యాన్ని ప్రశ్నించింది. ‘‘త్వరగా ఇంటికి రా..నీతో, నీ తండ్రితో తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి. ఈ సారి తప్పు జరగదు.’’ అంటూ ఇషానుల్లా ట్వీట్‌ చేశాడు.

పాకిస్థాన్‌లో బాలికల విద్యపై పోరాటం చేస్తున్న మలాలాపై 2012లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో కీలక సూత్రధారి అయిన ఉగ్రవాది ఇషానుల్లా 2017లో పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం 2020 జనవరిలో తాను జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుపుతూ ఆయన వీడియో విడుదల చేశాడు. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలతో కూడా ఆయన ట్విటర్‌లోనే సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇషానుల్లాకు చాలా ట్విటర్‌ ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు. మలాలాపై కాల్పుల ఘటనతో పాటు, 2014లో పెషావర్‌ ఆర్మీ పాఠశాలపై జరిగిన దాడిలో కూడా అతడి హస్తం ఉంది. మలాలా ప్రస్తుతం లండన్‌లో నివసిస్తోంది. బాలికల విద్య కోసం ఆమె చేస్తున్న పోరాటానికి గాను 2014లో ఆమెను నోబెల్‌ పురస్కారం వరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని