PM Modi: సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ

తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ఇక్కడి అగ్ని తీర్థంలో సముద్ర స్నానమాచరించారు.

Updated : 20 Jan 2024 20:02 IST

రామేశ్వరం: అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్ని తీర్థం (Agni Teertham)లో సముద్ర స్నానమాచరించారు. అంతేకాక ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భజనల్లో పాల్గొన్నారు.

రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం రామేశ్వరం. రావణాసురుడిని వధించిన తర్వాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడి సముద్ర తీరంలో శివలింగాన్ని తయారుచేసి పూజించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏడాది పొడవునా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి అగ్నితీర్థం సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకెళ్తున్నారు.

రామేశ్వరం.. రాముడు నడయాడిన నేల

ప్రధాని మోదీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మహారాష్ట్ర నాసిక్‌లోని రామ్‌కుండ్‌ కాలారామ్‌ దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళ గురువాయుర్‌ ఆలయం, త్రిప్రయార్‌ రామస్వామి దేవాలయాలను ఇప్పటికే దర్శించుకున్నారు. శనివారం తిరుచిరాపల్లి రంగనాథస్వామి, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని