GST: గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ ఇకనుంచి ‘కుటుంబ సర్వనాశన ట్యాక్స్‌’

హోటల్‌ వసతి, ప్రీ-ప్యాక్డ్‌ ఆహార పదార్థాలపై వస్తు సేవల పన్ను (GST) వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు.

Published : 30 Jun 2022 01:52 IST

ప్రభుత్వం తీరుపై మండిపడ్డ రాహుల్‌ గాంధీ

దిల్లీ: హోటల్‌ వసతి, ప్రీ-ప్యాక్డ్‌ ఆహార పదార్థాలపై వస్తు సేవల పన్ను (GST) వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి ‘గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌’గా ఉన్న జీఎస్‌టీ ఇప్పుడు ‘గృహస్తీ సర్వనాశన్‌ ట్యాక్స్‌’ (కుటుంబాలను సర్వనాశనం చేసే టాక్స్‌)గా రూపుచెందబోతోందని ఆరోపించారు. మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్‌, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్‌, లేబుల్డ్‌ ఆహార వస్తువులపైనా పన్ను విధించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు.

‘ఓవైపు తగ్గుతోన్న ఉపాధి, ఆదాయం.. మరోవైపు ద్రవ్యోల్బణం దెబ్బ. ఇలా ప్రధానమంత్రి గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌ (Gabbar Singh Tax) ఇప్పుడు కుటుంబాలను విధ్వంసం చేసే ట్యాక్స్‌గా మారబోతోంది’ అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆహార ఉత్పత్తులు, విద్య, హోటల్‌ వసతి వంటివి ఇక మరింత ప్రియం కాబోతున్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వస్తు సేవల పన్ను విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతోన్న రాహుల్‌ గాంధీ.. ఇప్పటివరకు దాన్ని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌గా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్‌టీ మండలి (GST Council) ఇటీవల సమావేశమైంది. ఈ సందర్భంగా కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులకు జీఎస్‌టీ మండలి ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని