Modi Story: పాలగిన్నె కోసం ఆ పిల్లాడి చూపు.. మోదీ జీవితంలో కొత్త మార్పు

అవి 1980ల నాటి రోజులు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓ రోజు గుజరాత్‌కు చెందిన డాక్టర్‌ అనిల్ రావల్‌ అనే వ్యక్తి మోదీతో కలిసి ప్రయాణం చేశారు.

Published : 27 Mar 2022 01:59 IST

‘మోదీ స్టోరీ’.. ప్రధాని జీవితంలో మనకు తెలియని ఘట్టాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: అవి 1980ల నాటి రోజులు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఓ రోజు గుజరాత్‌కు చెందిన డాక్టర్‌ అనిల్ రావల్‌ అనే వ్యక్తి మోదీతో కలిసి ప్రయాణం చేశారు. ఆ సమయంలో రాజకీయాల గురించి సంభాషణ రాగా రావల్‌.. మోదీని ఓ ప్రశ్న అడిగారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసం ఎలా కట్టుబడి ఉంటారు..? అని ప్రశ్నించారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘‘ఒక సారి నేను ఓ స్వయంసేవక్‌ ఇంటికి వెళ్లాను. అది ఓ మురికివాడలో ఉంది. ఆ ఇంట్లో స్వయంసేవక్‌ తన భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. నేను వెళ్లగానే నాకు పళ్లెంలో సగం రొట్టె, చిన్న గిన్నెలో పాలు తీసుకొచ్చి అందించారు. తల్లి ఒడిలో కూర్చున్న ఆ చిన్నారి ఆ పాలగిన్నె వైపు ఆకలిగా చూస్తున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది ఆ పాలు చిన్నారి కోసం ఉంచినవి అని. నేను ఆ సగం రొట్టెను నీళ్లతో తినేసి పాలు వదిలేశారు. ఆ తర్వాత ఆ తల్లి పాలగిన్నెను చిన్నారికి ఇచ్చింది. ఆ బాబు వాటిని గడగడా తాగేశాడు. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే నేను నిర్ణయించుకున్నా. సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి కోసమే నా ఈ జీవితం అంకితం చేయాలని..!’’ అని చెప్పారు.

ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్‌ అనిల్‌ రావల్‌ చెబుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈయనే కాదు.. మోదీతో అనుబంధం, పరిచయం ఉన్న ఎంతోమంది ప్రధానితో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆ స్ఫూర్తిదాయక అనుభవాలతో కూడిన ప్రత్యేక పోర్టల్‌ తాజాగా ప్రారంభమైంది. MODI STORY పేరుతో రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి చేతుల మీదుగా ప్రారంభించారు. 

మోదీ గురించి ఎంతోమందికి తెలియని అరుదైన ఘట్టాల సమాహారమే ఈ వెబ్‌సైట్‌. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో మోదీ చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్‌ రాస్‌ బిహారీ మణియార్‌, 90వ దశకంలో ఆయనకు ఆశ్రయం కల్పించిన శారదా ప్రజాపతి వంటి వారు.. ఇందులో మోదీతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా, బ్యాడ్మింటన్‌ కోచ్‌ దిగ్గజం పుల్లెల గోపీచంద్ సహా మరికొందరు మోదీతో తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో మోదీ ఆలోచనలు, విద్యార్ధిగా సైనిక దళాలపై ఆయన అభిప్రాయాలు, దేశ సేవపై ఆసక్తి వంటి వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ నుంచి భాజపా అధికారిక ట్విటర్‌ ఖాతాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు తమ ట్విటర్‌ ఖాతాల్లో రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని