సివిల్స్‌ అభ్యర్థులకు మరో అవకాశానికి సుప్రీం నో

కరోనా కారణంగా గత ఏడాది జరిగిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరుకాలేక చివరి అవకాశాన్ని కూడా కోల్పోయిన అభ్యర్థులకు మరో వెసులుబాటు ఇచ్చేది లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది......

Updated : 24 Feb 2021 15:03 IST

దిల్లీ: కరోనా కారణంగా గత ఏడాది జరిగిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరుకాలేక చివరి అవకాశాన్ని కూడా కోల్పోయిన అభ్యర్థులకు మరో వెసులుబాటు ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. కరోనా కారణంగా అభ్యర్థులు పరీక్షలకు సరిగా సిద్ధం కాలేదని.. మరో అవకాశం ఇవ్వాలంటూ రచనాసింగ్ అనే సివిల్స్ అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2020లో చివరి ప్రయత్నం చేసిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ వేశారు. దీన్ని నేడు సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

అభ్యర్థులకు మరో అవకాశం కల్పించేందుకు తొలుత నిరాకరించిన కేంద్రం.. తర్వాత అంగీకరించింది. కరోనా నేపథ్యంలో దీన్ని ప్రత్యేక పరిస్థితిగా భావించి ఇస్తున్న అవకాశమని.. దీన్ని భవిష్యత్తులో సాకుగా వాడుకోవద్దని కోరింది. ఈ మేరకు నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు వదిలేసింది. కానీ, మరో అవకాశం కల్పించడం ద్వారా కొంత మంది అభ్యర్థుల పట్ల వివక్ష చూపినట్లవుతుందన్న వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని