Pandemic: తదుపరి మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకం కావొచ్చు..!

కొవిడ్-19 కంటే భవిష్యత్తులో సంభవించే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చట. అందుకే కరోనా నేర్పించిన పాఠాలను వృథా కానీయకుండా, మరో విజృంభణకు ప్రపంచం సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవాలి. ఈ మాటలన్నది ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనికా టీకా సృష్టికర్తల్లో ఒకరైన సారా గిల్బర్ట్. 

Published : 06 Dec 2021 20:15 IST

లండన్‌: కొవిడ్-19 కంటే భవిష్యత్తులో సంభవించే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చట. అందుకే కరోనా నేర్పించిన పాఠాలను వృథా కానీయకుండా, మరో విజృంభణకు ప్రపంచం సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవాలి. ఈ మాటలన్నది ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనికా టీకా సృష్టికర్తల్లో ఒకరైన సారా గిల్బర్ట్. 

‘భవిష్యత్తులో వచ్చే మహమ్మారి మరింత దారుణంగా ఉంటుందన్నది వాస్తవం. అది వేగంగా ప్రబలే అవకాశమూ ఉంది లేక ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. లేకపోతే ఈ రెండు లక్షణాలతోనూ విజృంభిచవచ్చు. వైరస్‌ మన జీవితాలు, జీవనోపాధిని దెబ్బతీయడం ఇదే చివరిసారి కాదు. దీన్ని దృష్టిలోపెట్టుకొని మనం సాధించిన ప్రగతి, విజ్ఞానం కోల్పోకూడదు’ అని గిల్బర్ట్ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. 

అలాగే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి మాట్లాడుతూ.. దాని స్పైక్ ప్రొటీన్‌లో వైరస్ వ్యాప్తిని పెంచే ఉత్పరివర్తనాలున్నాయని చెప్పారు. ఆ వేరియంట్‌ గురించి, టీకాలను ఏమార్చే సామర్థ్యం గురించి మరింత సమాచారం తెలుసుకునే వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

దాదాపు రెండేళ్లుగా కరోనా మహమ్మారి ఎంతటి విలయాన్ని సృష్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. 26.6 కోట్లకుపైగా కరోనా కేసులు.. 52.7 లక్షల మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో వైద్య సేవలు అందక ఎంతో మంది విలవిల్లాడారు. ఎన్నో హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పలు రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో ఒమిక్రాన్ కలవరం మొదలైంది. దాంతో సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని ఈ ప్రపంచం ఎదురుచూస్తోంది..! ఇంకోపక్క ధనిక-పేద దేశాల మధ్య అంతరాయం స్పష్టంగా కనిపించింది. కొన్ని దేశాలకు టీకా పంపిణీ సరిగా జరగనేలేదు.. ధనిక దేశాలు మాత్రం బూస్టర్లు ఇస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన నిపుణుల బృందం పలు సూచనలు చేసింది. శాశ్వత నిధుల అందుబాటు, మహమ్మారి గురించి పూర్తి తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని